ఆదిలాబాద్: అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గురువారం అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి వరద వచ్చి చేరడంతో నిండుకుండల్లా మారాయి. నగరాలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో వాగులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
కుమురం భీం జిల్లా వాంకిడిలో 27.30 సెంటీమీటర్ల వాన పడింది. 150 మండలాల్లో ముసురు కొనసాగు తోంది. వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్, భైంసా పట్టణాలు నీటమునిగాయి. గోదావరిలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని సహాయం కావాల్సినవారు 18004251939 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. ఉట్నూరు, నేరడిగొండ, బోథ్లో రెస్క్యూ బృందాలతో సహాయ చర్యలు ప్రారంభించారు. ఇక నిర్మల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. నిర్మల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం నంబర్ 790628368ను సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తడిసిముద్దయింది. నిర్మల్, ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాల్లోని పలు మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 35 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరద ఉద్ధృతితో నిర్మల్, భైంసా పట్టణాలు నీట మునిగాయి.