నిర్మల్ టౌన్, జూలై 20 : ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సాధారణ ప్రసవాలపై సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లాలోని పీహెచ్సీలతో పాటు ప్రాంతీయ దవాఖానలతో పాటు ప్రైవేట్ వైద్యశాలల్లో జరుగుతున్న ప్రసవాల్లో ఇప్పటికి 80శాతం ఆపరేషన్లు చేస్తున్నారని, ఈ పద్ధతిని మార్చేలా చూడాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వైద్యశాలల్లో సాధారణ ప్రసవాలు చేయకుండా కుటుంబసభ్యులపై ఒత్తిడి తెచ్చి అధిక ఫీజులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వైద్యశాలల వారీగా సాధారణ ప్రసవాల కోసం టార్గెట్లను విధించుకొని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పని చేసే వైద్యులతో పాటు సిబ్బంది రోగులు, వారి కుటుంబ సభ్యులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. సమయపాలన పాటించాలని, బయోమెట్రిక్ హాజరుశాతాన్ని నమోదు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, వైద్యులు శ్రీకాంత్, ఆశిష్రెడ్డి, అవినాశ్, అరుణ్, కిరణ్మయి, కాశీనాథ్ పాల్గొన్నారు.