నిర్మల్ టౌన్, జూలై 27 : నిర్మల్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాగా, పునరుద్ధరణ పనులను అధికారులు వేగవంతం చేశారు. అంధకారంగా మారిని గ్రామాలకు పూర్తిస్థాయిలో కరంట్ సరఫరా చేశారు. ఈ నెల 22న భైంసా, నిర్మల్, కడెం, దస్తురాబాద్, గోదావరి పరీవాహక ప్రాం తంలో భారీ స్థాయిలో నష్టం సంభవించింది. సో న్, లక్ష్మణచాంద, మామడ, కడెం, దస్తురాబాద్, పెంబి, స్వర్ణవాగు, గడ్డెన్నవాగు, పోట్యా తదితర ప్రాంతాల్లో స్తంభాలు విరిగిపోయాయి. ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయాయి. మొత్తంగా జిల్లాలో 1725 స్తంభాలు విరిగిపోగా, సుమారు 258 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. రూ.1.80 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు.
50 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాల మేరకు మూడు రోజులుగా మరమ్మతు పనులు చేపట్టారు. సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరాను మంగళవారం నాటికి పూర్తిచేసినట్లు విద్యు త్ శాఖ జిల్లా అధికారి జయంత్రావు చౌహాన్ తెలిపారు. అలాగే ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేసి, అమర్చనున్నట్లు పేర్కొన్నారు. వారం రోజుల్లో పనులన్నీ పూర్తి చేసి, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు, అధికారుల సహకారంతో పనులు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఒక్కో మండలానికి ఒక్కో ప్రత్యేకాధికారిని నియమించి, ప్రతి రోజూ పనులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
లక్ష్మణచాంద, జూలై 27 : మండలంలోని మునిపెల్లి శివారులోని గోదావరి ఒడ్డున విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ శాఖ ఎస్ఈ జయంత్రావు చౌహాన్ పరిశీలించారు. మరమ్మతులు త్వరితగతిన పూర్తిచేస్తామన్నారు. మండలంలోని పీచర, ధర్మారం, పార్పెల్లి, మునిపెల్లి, చింత్చాంద శివారులో గోదావరి తీరాన స్తంభాలు విరిగిపడినట్లు గుర్తించామని తెలిపారు. ఆయన వెంట విద్యుత్శాఖ డీఈ మధుసుదన్రావు, ఏఈ మల్లేశ్, సిబ్బంది ఉన్నారు.