నిర్మల్ అర్బన్, జూలై 21 : ఆధ్యాత్మికతకు కేంద్ర బిందువైన గండిరామన్న దత్తసాయి ఆలయం అభినవ షిర్డీగా వెలుగొందుతున్నది. ఎంతో మహిమాన్వితమైన ఈ ప్రదేశం.. నిత్యం ధూపదీప నైవేద్యాలతో, సాయినామ స్మరణతో మార్మోగుతున్నది. ఇంతటి మహిమాన్వితమైన ప్రదేశంలో అడుగు పెట్టేందుకు నిత్యం వేలాది మంది భక్తులు నిర్మల్ కేంద్రంతో పాటు ఇతర పాంత్రాల నుంచి తరలివస్తారు. దత్తసాయి ఆలయాన్ని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. రుషులు ధ్యానం చేసిన పుణ్యభూమిగా దత్తసాయి ఆలయం విరాజిల్లుతున్నది. ఆలయ సన్నిధిలో బాబా ప్రతిమతో పాటు భారీ రూపంలో ఉన్న శివుడి విగ్రహం భక్తులకు కనువిందు చేస్తున్నది. మునులు, రుషులు తపస్సు చేసిన గుహలు ఇప్పటికీ ఇక్కడ దర్శనీయ ప్రదేశాలే. బాబా ఆలయం ఎదుటి గుట్టపై కంచు రాతిని వేరే రాళ్లతో కొడితే వివిధ రకాల శబ్దాలు వినిపిస్తుంటాయి. కొండపై వెలిసిన శివాలయానికి వందల ఏండ్ల చరిత్ర ఉంది. ఆలయం చుట్టూ భారీ చెట్లు, గుట్టలు ఉండడంతో ఇక్కడ ఎంతో ప్రశాంత వాతావరణం నెలకొందని భక్తులు చెబుతున్నారు.
షిర్డీ తరహాలో ఆలయ నిర్మాణం..
షిర్డీని తలపంచేలా ఆలయాన్ని నిర్మించడంతో గండిరామన్న ఆలయాన్ని అభినవ షిర్డీగా పిలుచుకుంటారు. ఆలయంలో చుట్టూ పచ్చని చెట్ల మధ్య నిర్మించిన ఈ ఆలయం ప్రకృతి ఒడి లో ఉన్నట్లు కనిపిస్తున్నది. సాయిబాబా, దత్త సాయి ఆలయా లు, దూని, ధ్యాన మందిరాలు, భారీ శివుని విగ్రహం, అన్నం కలిపే సాయిబాబా విగ్రహం, పిల్లలు ఆటలాడుకునేందుకు స్థలం, మైనంతో తయారు చేసిన సాయిబాబా విగ్రహం ప్రత్యే క ఆకర్షణగా నిలుస్తున్నాయి. మైనపు విగ్రహం చుట్టూ పచ్చని గార్డెన్లో భక్తులు సేదతీరేందుకు అనువుగా ఏర్పాటు చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా నందదీప్..
ఇంతటి మహిమాన్విత ప్రాంతంలో సాయి నందదీప్ను ఏర్పాటు చేయడంతో ఆలయం మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. గండిరామన్న దత్త సాయి ఆలయం ఎదుట ఖాళీ స్థలంలో దాదాపు 16 అడుగులతో కూడిన భారీ దక్షిణముఖ హన్మాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఎదురుగా సాయి అఖండ నందదీప్ను నిర్మించారు. ఈ సాయి నందదీప్ దర్శనానికి భక్తులు నిత్యం తరలివస్తున్నారు.
దత్త జయంతికి ఏర్పాట్లు పూర్తి..
గండిరామన్న దత్తసాయి ఆలయంలో గురువారం నుంచి దత్త జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8.30 గంటలకు సాయినామ పూజా కార్యక్రమంతో దత్త జయంతి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. శనివారం దత్త జయంతి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల నుంచి దాదాపు 20వేల మంది భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు.
పూజా కార్యక్రమాలు..
దత్తజయంతి సందర్భంగా మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గురువారం ఉదయం స్వామివారికి మంగళస్నానంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8.30 గంటలకు సాయినామ పూజ, 48 గంటల పాటు అఖండ సాయినామ సంకీర్తన, సాయంత్రం 6 గంటలకు సాయి పల్లకీ ఊరేగింపు, శుక్రవారం సాయిబాబాకు మంగళస్నానం, అర్చన పూజ, సాయంత్రం 6 గంటలకు పల్లకీ ఊరేగింపు, శనివారం గురుపౌర్ణమి సందర్భంగా ఉదయం 5.30 గంటలకు మంగళస్నానం, పాలాభిషేకం, అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 11.30 గంటలకు సాయినామం సమాప్తం, మధ్యాహ్నం 12 గంటలకు హారతి, అనంతరం అన్నదానం నిర్వహిస్తారు. అఖండ సాయినామ సంకీర్తనలో కామోల్, చించాల, ఎడ్బిడ్, వెంకటాపూర్, నిర్మల్ భజన మండలి బృందాలు పాల్గొననున్నాయి.
జయప్రదం చేయండి..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని గండిరామన్న దత్తసాయి ఆలయంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం. ఆలయ ట్రస్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాం.భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. వాహనాల పార్కింగ్, డైనింగ్, బారికేడ్లను ఏర్పాటు చేశాం. జిల్లాలోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకలను జయప్రదం చేయండి.