గణపతి బస్పా మోరియా.. ఆదా లడ్డూ కాలియా.. జై బోలో గణేశ్ మహారాజ్కీ జై.. అంటూ నినాదాలు మారుమోగాయి. శనివారం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గణనాథుడి నిమజ్జనోత్సవం కనులపండువగా సాగింది. యువతీయువకుల కేరింతలు, డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు.. శోభాయాత్ర ఆకట్టుకున్నాయి. పట్టణంలోని గణేశ్నగర్లో గల మున్నూరు కాపు సంఘ భవనంలో ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్కుమార్ శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా గణేశుడి వద్ద విశేష పూజలు అందుకున్న లడ్డూలను వేలం వేయగా.. భారీ మొత్తం చెల్లించి భక్తులు దక్కించుకున్నారు. కాగా.. ఇద్దరు ఏఎస్పీలు, 600 మంది పోలీసు సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేసి నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగేలా చేశారు. అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టు వద్ద గణనాథులను నిమజ్జనం చేసి వినాయకా సెలవికా అంటూ వీడ్కోలు పలికారు.
నిమజ్జనోత్సాహం
భైంసా/ భైంసా టౌన్, సెప్టెంబర్ 18 : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వినాయకుడి శోభాయాత్ర కనుల పండువగా సాగింది. గణేశ్ మండలి సభ్యులు, యువజన సంఘాల నాయకులు, హిందూవాహిని, కుల సంఘాలు, ఉత్సవ కమిటీ సభ్యులు మంగళహారతులిచ్చి నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించారు. భైంసా పట్టణంలోని గణేశ్ నగర్లో గల మున్నూరు కాపు సంఘ భవనంలో ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్కుమార్, ఎమ్మెల్యే విఠల్రెడ్డి, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు విలాస్ గాదేవార్, బబ్రు మహారాజ్, డాక్టర్ నగేశ్, కాంగ్రెస్ నాయకులు రామారావు పటేల్, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, నాయకులు రాము, ప్రసన్నజిత్ ఆగ్రే, గాలి రవి, భట్టిగల్లి మున్నురుకాపు సంఘం అధ్యక్షుడు పోశెట్టి ఆధ్వర్యంలో వినాయక శోభాయాత్ర ఘనంగా జరిగింది. భారీ గణేశ్ విగ్రహాలను క్రేన్ సహాయంతో ట్రాక్టర్లలో ఎక్కించి నిమజ్జనానికి తరలించారు. శోభాయాత్ర కొనసాగే దారుల్లో మహిళలు వినాయకుడికి హారతులిస్తూ, అక్షింతలు చల్లుతూ టెంకాయలు కొట్టారు.
కోలాహలంగా..
భైంసా పట్టణంలోని అన్ని వీధులు కోలాహలంగా కనిపించా యి. గణేశ్ మండళ్లు, పలు యువజన సంఘాలు ప్రతిష్ఠించిన వినాయక ప్రతిమలను ఉదయం 10గంటల నుంచే నిమజ్జనం చేశారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్దకు చేరుకున్న వాహనాలను వరుస క్రమంలో అనుమతించి ప్రతిమలను నిమజ్జనం చేశారు. కాగా.. నిమజ్జన శోభాయాత్ర పలువురిని ఆకట్టుకుంది. బ్యాం డు మేళాలు, తాషా వంటి వాటితో యువకులు, మండళ్ల సభ్యు లు నృత్యాలు చేశారు. కేరింతలు కొడుతూ హుషారుగా క నిపించారు. యువత నృత్యాలు చేస్తూ సెల్ఫీల్లో బంధిస్తూ ఆనందంగా గడిపారు. పలువురు పులిహోర, ఉప్మాను పంపిణీ చేశారు.
భారీ బందోబస్తు
భైంసా పట్టణంలో నిర్వహించిన గణేశ్ నిమజ్జనానికి ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో ఇద్దరు ఏఎస్పీలు, సుమారు 600ల సిబ్బంది మోహరించారు. ఏఎస్పీ కిరణ్ఖారే, సీఐ ప్రవీణ్కుమార్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకున్నారు. 134 గణేశ్ మండలిలు ప్రతిష్ఠించిన వినాయకులు శోభాయాత్రలో ఎక్కడి వరకు చేరుకున్నాయి? నిమజ్జనం ఎలా జరుగుతుంది? వంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా పోలీస్స్టేషన్లో కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. గతంలో భైంసాలో పనిచేసిన సబ్ ఇన్స్పెక్టర్లు నిమజ్జనోత్సవ బందోబస్తులో పాల్గొన్నారు. మఫ్టీలో ఉన్న పోలీసులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని కంట్రోల్ రూమ్కు చేరవేశారు.కాగా.. మంచిర్యాల జిల్లా చెన్నూర్, ఆదిలాబాద్ జిల్లా బోథ్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కూడా వినాయక శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి.