ఎదులాపురం / నిర్మల్ టౌన్ , సెప్టెంబర్18: పరిపూర్ణమైన ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ అన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెకర్లతో 20 22 ప్రత్యేక ఓటరు నమోదు, పెండింగ్ ఫారాలు, ఎపిక్ కార్డులు, స్వీప్ కార్యక్రమాలపై శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2022 ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పిదాలు లేకుండా చూడాలని ఆదేశించారు. కొత్తగా ఓటరుగా నమోదయ్యేందుకు సమర్పించిన ఫారాలు, మార్పులు, చేర్పులకు సంబంధించిన ఫారాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటర్గా వారి పేరు నమోదు చేసుకునేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ ఎపిక్ కార్డులను డౌన్లోడ్ చేసుకొని సంబంధిత ఓటర్కు అందజేయలని సూచించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో పరిపూర్ణమైన ఓటర్ జాబితాలను సిద్ధం చేయడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఓటర్ నమోదు, మార్పు లు, చేర్పులు, సవరణలకు సంబంధించినవి 152 ఫారాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ మాట్లాడుతూ.. ఓటర్ జాబితాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పెండింగ్ ఫారాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వీసీలో ఆదిలాబాద్, నిర్మల్ అదనపు కలెక్టర్లు ఎస్.నటరాజ్, రాంబాబు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు నలంద, ప్రియ, అనిరుధ్, షబ్బీర్, రాజశ్రీ, విశాల్, ఆదిలాబాద్ ఆర్టీవో రాజేశ్వర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, ఎన్నికల విభాగం నాయబ్ తహసీల్దార్ మహేశ్, తదితరులు పాల్గొన్నారు.