అనుమానం ఆమె ప్రాణం తీసింది. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ఆరంభించాలని పెళ్లి చేసుకున్న ఆ యువతికి విషాదం తప్పలేదు. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడిగా మారాడు. పెళ్లయి 8 నెలలు కూడా కాకముందే ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. తానే సర్వస్వం అనుకున్న భర్తే.. ఆమెను గొంతునులిమి దారుణంగా హత్య చేశాడు. ఈ విషాద సంఘటన ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో మంగళవారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా అందకూర్ గ్రామానికి చెందిన కట్ట నిఖిల్కు భైంసా మండలం కామోల్ గ్రామానికి చెందిన గౌతమితో ఎనిమిది నెలల క్రితం పెళ్లి జరిగింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో తరుచూ గొడవపడుతుండేవాడు. రెండు నెలల క్రితం కూడా ఇలాగే గొడవ పడి ఎవరికీ చెప్పకుండా భార్య గౌతమిని తీసుకొని పుణెకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ కాల్స్ ఆధారంగా మహారాష్ట్రలోని పుణెలో ఉన్నట్లు గుర్తించారు. కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అప్పటి నుంచి భార్యతో కలిసి కుంటాలలో అద్దెకు ఉంటూ బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు.
మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో గౌతమి నిర్జీవ స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన ఇంటి యజమానురాలు కాలనీవాసులకు సమాచారం అందించింది. అంతకుముందే గౌతమిని గొంతు నులిమి చంపేశానని పోలీసులకు, తాను పనిచేస్తున్న యజమానికి నిఖిల్ తెలిపాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఘటనా స్థలిని ఏఎస్పీ కిరణ్ ప్రభాకర్ ఖారే పరిశీలించారు. గౌతమి హత్యకు గల కారణాలను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గౌతమి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటనా స్థలికి చేరుకొని ఆందోళనకు దిగారు. తమ కూతురిని అకారణంగా చంపిన నిఖిల్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని సముదాయించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గౌతమి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ షరీఫ్ తెలిపారు.