ఆదిలాబాద్ : కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ టీకాలను ఇస్తుంది. 18 సంవత్సరాలు నిండిన వారందరూ టీకా తీసుకునేలా ప్రణాళికలు తయారు చేసింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గురువారం నుంచి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. పట్టణాల్లో ప్రతి వార్డులో, గ్రామాల్లోని వైద్యశాఖ సబ్సెంటర్లలో టీకాలను పంపిణీ చేయనున్నారు. వైద్యశాఖ సిబ్బందితో పాటు గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, మెప్మా, డీఆర్డీవో సిబ్బంది అర్హులైన వారందరినీ గుర్తించి వ్యాక్సిన్ తీసుకునేలా చూస్తారు. కలెక్టర్ల పర్యవేక్షణలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్కు అన్ని ఏర్పాట్లు చేశామని ప్రజలు తమ ప్రాంతాల్లో వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చి టీకా తీసుకోవాలని అధికారులు కోరుతున్నా రు. మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా రెండు జిల్లాల్లో 319 టీకా కేంద్రాలను వైద్యశాఖ అధికారులు ఏర్పాటు చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో 175, నిర్మల్ జిల్లాలో 144 సెంటర్లలో ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 1,74,396 మందికి, నిర్మల్ జిల్లాలో 1,92,249 మందికి వ్యాక్సిన్ వేశారు. ఈ డ్రైవ్లో అర్హులైన వారందరికీ వందశాతం టీకాలు వేసేందుకు చర్యలు చేపట్టారు. పట్టణ ప్రాంతాల్లో వార్డులను యూనిట్గా, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యశాఖ సబ్సెంటర్ యూనిట్గా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
రెండు జిల్లాలో ప్రతిరోజు 30 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పట్టణంలోని భుక్తాపూర్, ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసరి టీకా కేంద్రాలను పరిశీలించారు. నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ ముథోల్, లోకేశ్వరం మండలాల్లో పలు వ్యాక్సిన్ కేంద్రాలను సందర్శించి టీకా పంపిణీని పరిశీలించారు.