ఆసిఫాబాద్ : కుల వృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి,డీఎఫ్ఓ శాంతారాంతో కలసి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత కుల వృత్తులు చేసుకోనే వారిని ఆర్థికంగా ప్రోత్సహిస్తు ముందుకు తీసుకువెళ్తుందని పేర్కొన్నారు. వెదురుతో తయారు చేసే వారిలో మంచి కళానైపుణ్యం దాగి ఉందన్నారు.వెదురుతో 40 రకాల వస్తువులను మేదరివాళ్లు తయారు చేస్తున్నారన్నారు. చేతితోనే 5 రకాల పని ముట్లను ఉపయోగించి వెదురుతో తయారు చేయడం వారి కళకు నిదర్శనమని తెలిపారు.
మేదరులను ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు అరిగెల నాగేశ్వర్రావు, సంతోష్, ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, ఏఎంసీ వైస్ చైర్మన్ గదవేణి మల్లేశ్, ఆత్మ చైర్మన్ రమేశ్, బీసీ సంక్షేమాధికారి సత్యనారాయణ రెడ్డి,సింగిల్ విండోచైర్మన్లు సంజీవ్,అలీబీన్హైమద్ మేదరి సంఘం నాయకులు, కులస్తులు పాల్గొన్నారు.