బోథ్ : గొర్రెలు మేపడానికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు కుంటలో పడి చనిపోయిన విషాదకర సంఘటన బోథ్ మండలంలోని రఘునాథ్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆడె రవీందర్-కవిత దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు ఆడె కుమార్, చిన్న కుమారుడు ఆడె గణేశ్ (16). వీరు ప్రతిరోజూ మాదిరిగానే బుధవారం కూడా గొర్రెలు మేపడానికి పాత ఖండిపల్లె సమీపంలోని ప్రాజెక్టు పరిసరాలకు వెళ్లారు. అలుగు కింది భాగంలో ఉన్న కుంటలో గొర్రెలకు నీళ్లు తాగించారు. బురదమయంగా ఉన్న గొర్రెలను కడగడంతో గణేశ్ బట్టలకు బురద అంటుకోవడంతో వాటిని శుభ్రం చేసుకోవడానికి కుంట వద్దకు వెళ్లాడు.
దీంతో ప్రమాదవశాత్తు కాలుజారి కుంటలో పడిపోయాడు. పక్కనే ఉన్న కుమార్, మరో మంద కాపరి జాదవ్ రమేశ్ గణేశ్ను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. గ్రామస్తులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి వెళ్లి వెతికినా జాడ కనిపించ లేదు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై రాజు అక్కడికి చేరుకున్నారు. ఈత గాళ్లతో కుంటలో గాలింపు చేయగా అడుగు భాగంలో చిక్కుకున్న గణేశ్ మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బాలుని మృతితో రఘునాథ్పూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి.