ఎదులాపురం : ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం జిల్లా కోర్టు కార్యాలయ ఆవరణ నుంచి న్యాయసేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఆడపిల్లల హక్కులపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా గ్రామీణ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
రాజ్యాంగం ద్వారా ఆడపిల్లలకు సంక్రమించిన హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ర్యాలీని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి జి. ఉదయ్ బాస్కర్రావు, జిల్లా న్యాయ సేవఅధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే , జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్. భీమ్ కుమార్, డీఎల్ఎస్ఏ కార్యాలయ పర్యవేక్షకురాలు శైలజ, కోర్టు సిబ్బంది , స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.