ఇంద్రవెల్లి : గ్రామీణ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజనులు పెరటి కోళ్ల పెంపకం చేస్తే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఐకార్, డీపీఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసర్చ్ ట్రైబల్ సబ్ ప్లాన్)డైరెక్టర్ ఆర్ఎన్ చతర్జీ అన్నారు. మండలంలోని తుమ్మగూడ గ్రామంలో శనివారం ఆదివాసీ గిరిజనులకు చెందిన వంద కుటుంబాలకు ఉచితంగా పెరటి కోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరటి కోళ్ల పెంపకానికి ఆదివాసీ గిరిజనులు ముందుకు రావాలన్నారు. ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతి కోసం తమ సంస్థ కృషి చేస్తుందన్నారు. పెరటి కోళ్లు ఇచ్చే గుడ్లను మార్కెట్లో విక్రయించుకుంటే కుటుంబానికి ఆర్థికంగా లాభాలు వస్తాయన్నారు.
పెరటి కోళ్లను మార్కెట్లోకి అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవచ్చన్నారు. ఆదివాసీ గిరిజనులు వ్యవసాయంతోపాటు ఆర్థికంగా అభివృద్ధి చెందే అన్ని రకాల పశువులతోపాటు కోళ్లను పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కనక లక్కేరావ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసర్చ్ ట్రైబల్ సబ్ ప్లాన్ శాస్త్రవేత రాజు, సభ్యులు రాజ్కుమార్, లేశి, ప్రకాశ్, జైకుమార్, సర్పంచ్ మడావి షేకు, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ కనక హనుమంత్రావ్, ఐటీడీఏ గోండి కోఆర్డినేటర్ తోడసం దేవ్రావ్, గ్రామపటేల్ సోయం మాన్కుపటేల్, దేవారి సోయం భీంరావ్, మహజన్ లంకు తదితరులు పాల్గొన్నారు.