ఆదిలాబాద్, అక్టోబర్ 12 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 3.90 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగువుతున్నది. జూన్లో పంట వేయగా అక్టోబరు మొద టి వారంలో దిగుబడులు ప్రారంభమవుతా యి. 27 లక్షల క్వింటాళ్ల పంట విక్రయానికి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేశారు. గతేడాది సీసీఐ ఆధ్వర్యంలో 24 లక్షల క్వింటాళ్ల పంటను మద్దతు ధరతో కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాలుకు రూ.6025 మద్దతు ధర ప్రకటించగా, మార్కెట్యార్డుల్లో సీసీఐ కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు తయారు చేశారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ సీసీఐ, వివిధ శాఖల అధికారులు, వ్యాపారు లు, రైతుసంఘాల నాయకులతో మంగళవా రం సమావేశమై పత్తి సేకరణపై చర్చించారు. జిల్లాలో పత్తి కొనుగోళ్లు ఎలా చేయాలి, ఎప్పుడు ప్రారంభించాలి ఇతర విషయాలపై చర్చించారు. పలువురు సలహాలు, సూచనలు తీసుకున్నారు.రైతులు ఇబ్బందులు పడకుండా పర్యవేక్షించడంతో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నెల 20 నుంచి కొనుగోళ్లు చేపడుతామని ఇతర జిల్లాల్లో చెల్లిస్తున్న ధరను కూడా చెల్లిస్తామని వ్యాపారులు తెలిపారు. నాణ్యమైన పంటతో పాటు నిర్దేశిత తేమ శాతం ఉండేలా చూడాలన్నారు. ప్రైవేట్ కొనుగోళ్లు జరుగుతుండడంతో ఈ ఏడాది క్వింటాలుకు రూ.7000 వరకు ధర లభించే అవకాశాలున్నట్లు రైతుసంఘాల ప్రతినిధులు తెలిపారు. పత్తి కొనుగోళ్లకు సిద్ధంగా సీసీఐ అధికారులకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నటరాజ్, మార్కెటింగ్ శాఖ ఆర్జీడీ మల్లేశం, ఆర్డీవో రాజేశ్వర్, జిల్లా రవాణాశాఖ అధికారి పుప్పాల శ్రీనివాస్, వ్యవసాయశాఖ అధికారి ఆశాకుమారి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కేశవులు, తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా పత్తి సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి మంచి డిమాండ్ ఉంది. దీంతో ప్రైవేట్ వ్యాపారులు ప్రభు త్వం ప్రకటించిన మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో మంగళవారం క్వింటాలుకు రూ.7340 ఉం డగా, ఖమ్మంలో రూ.7700 ఉంది. మార్కెట్యార్డుల్లో కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.