తాండూర్ : సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్, సీఎం కేసీఆర్, గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కృషి కారణంగానే సింగరేణి కార్మికులకు ఎన్నో హక్కులు సాధింప బడ్డాయని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజు శ్రీనివాసరావు అన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి అబ్బాపూర్ ఓసీపీ-2 సమీపంలోని ఏరియా స్టోర్స్లో బుధవారం గేట్ మీటింగ్లో పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కోల్ ఇండియాలో, ఇతర ఏ సంస్థలో లేని విధంగా సింగరేణి కార్మికులకు కారుణ్య నియామకాలు కల్పించడం, వారి కుటుంబంలో కొడుకు లేదా అల్లుడు లేని క్రమంలో వివాహము అయినా కూతురికి, వీరి మీద ఆధారపడి ఉన్న కూతురికి కూడా ఉద్యోగం ఇచ్చే విధంగా సర్క్యులర్ జారీ చేయడం ప్రశంసనీయమని అన్నారు.
తల్లిదండ్రులకు వైద్య సౌకర్యం, కేడర్ స్కీం, గృహ రుణానికి వడ్డీ మాఫీ, అంబేద్కర్ జయంతికి వేతనముతో కూడిన సెలవు, క్యాడర్ స్కీం పరిష్కారం, అండర్ గ్రౌండ్ కార్మికులకు యూనిఫాం, తెలంగాణ ఇంక్రిమెంట్, సకల జనుల సమ్మె కాలానికి వేతనాలు, ఉచిత విద్యుత్తు ఇలాంటి ఎన్నో హక్కులు కార్మికులకు అందించారని గుర్తు చేశారు. జూన్ 2021 నుంచి రావలసిన 11వ వేతన ఒప్పందం వెంటనే పరిష్కరించాలని జాతీయ సంఘాలను డిమాండ్ చేశారు. సింగరేణిలో టీబీజీకేఎస్ గుర్తింపు సంఘం కార్మికులకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తుందన్నారు. బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి నాయకత్వంలో మరిన్ని సౌకర్యాలు కార్మికులకు అందిస్తామని అన్నారు.
ముఖ్యంగా 2020-21 సంవత్సరం లాభాల వాటా త్వరలో ప్రకటింప చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ కార్పొరేట్ చర్చల ప్రతినిధి దరావత్ మంగీలాల్, కేంద్ర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగం ప్రకాశరావు, స్టోర్స్ కార్యదర్శి గురిజాల రమేశ్, వర్క్షాప్ కార్యదర్శి రాజేశం, నాయకులు చంద్రయ్య, ఉద్యోగులు, కార్మికులు ఉన్నారు.