ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు దవాఖానంటేనే ప్రజలు భయపడేవారు. ఏ రోగమొచ్చినా ప్రైవేట్ వైద్యశాలలకు పరుగులు తీసేవారు. కష్టపడి సంపాదించిందంతా టెస్టులకు, మందులకు ధారపోసేవారు. స్వరాష్ట్రంలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ప్రతి సర్కారు దవాఖాన సకల సౌకర్యాలతో సరికొత్తగా మారింది. మంత్రి అల్లోల కృషితో నిర్మల్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల కూడా ప్రైవేట్ దీటుగా మెరుగైన వైద్యం అందిస్తున్నది. ఇక్కడ అధునాతన పరికరా లు ఏర్పాటు చేసి, 57 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ సెంటర్ స్థానికంగానే ఏర్పాటు చేశారు. మరోవైపు ఆక్సిజన్ ప్లాంట్ను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. – నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 22
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 22 : ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం చేయించుకోవాలంటేనే రోగులు జంకేవారు. అక్కడి వైద్యమన్నా.. సూది మందు అన్నా ‘నేను రాను.. నాకొద్దు’ అనేవారు. కానీ స్వరాష్ట్రంలో సర్కారు దవాఖానల రూపురేఖలే మారిపోయాయి. అక్కడ వైద్యం చేయించుకునేందుకు పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు ఉన్నత వర్గాలు సైతం ముందుకొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కోట్లాది రూపాయల నిధులను వైద్య రంగానికి వెచ్చిస్తున్నది. మారుతున్న కాలానికి అనుగుణంగా దవాఖానల్లో నూతన పరికరాల ఏర్పాటు, అనుభవజ్ఞులైన వైద్యులను నియమిస్తున్నది. రోగికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా 24 గంటల పాటు మెరుగైన సేవలందేలా చర్యలు తీసుకున్నది. దీంతో చిన్నపాటి వైద్యం నుంచి శస్త్రచిక్సితల వరకూ రోగులు ప్రభుత్వ దవాఖానలనే ఆశ్రయిస్తూ క్షేమంగా ఇంటికి చేరుకుంటున్నారు.
మంత్రి అల్లోల ప్రత్యేక కృషి..
జిల్లా దవాఖానలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక రణ్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారు. వైద్యులు, వైద్య కమిటీ సభ్యులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. రోగులకు ఎలాంటి సేవలు అందుబాటులోకి తీసుకురావాలి? ఏఏ సౌకర్యాలు కల్పించాలన్న దానిపై వివరాలు, అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. వైద్యశాల అభివృద్ధిలో భాగంగా డయాలసిస్, టీ డయాగ్నోస్టిక్, ఆర్టీపీసీఆర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. రోగికి ప్రాణాపాయ స్థితిలో అందించే ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తికాగా.. ప్రారంభానికి సిద్ధమైంది.
పెరుగుతున్న సేవలు
స్వరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ దవాఖానల దశ మారింది. దీంతో రోగులు ప్రైవేట్ దవాఖానలకు స్వస్తి పలికి సర్కారు వైద్యం వైపు పరుగులు తీస్తున్నారు. ఇక్కడ మెరుగైన వైద్యం అందుతున్న తీరును తెలుసుకుంటూ ఆ సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతిరోజూ సుమారు 250 మంది రోగులు ఓపీ సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. వివిధ అనారోగ్య కారణాలతో రోజుకు సుమారు 50 మంది ఔట్ పేషెంట్లుగా చేరుతున్నారు. దవాఖానలో సర్జికల్, ఆర్థో, ఆరోగ్యశ్రీతో పాటు కార్డియాలజీ, యూరాలజీ సేవలు తప్పా అన్ని రకాల వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. 25 మంది వైద్యులు పరీక్షలు నిర్వహిస్తూ 24 గంటల పాటు రోగులకు అందుబాటులో ఉంటున్నారు. అత్యవసర సేవల కోసం బెడ్లు అందుబాటులో ఉండగా, ఆక్సిజన్, వెంటిలేటర్ 3, ఈసీజీ, డయాలసిస్, బ్లడ్బ్యాంక్, డిజిటల్ ఎక్స్రే సదుపాయాలున్నాయి. దీంతో ప్రభుత్వ వైద్యశాల వైపు ప్రజలు మళ్లుతున్నారు.
ఆర్టీపీసీఆర్ పరీక్షలు ప్రారంభం..
కొవిడ్ కేసుల నిర్ధారణకు ఉపయోగించే ఆర్టీపీసీఆర్ టెస్ట్ సెంటర్ను జిల్లా దవాఖానలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆగస్టు 15న ప్రారంభించారు. వైద్యులు ఆర్టీపీసీఆర్ టెస్టులతో కచ్చితమైన కరోనా కేసులను నిర్ధారిస్తారు. గతంలో ఈ టెస్టులు హైదరాబాద్లో మాత్రమే నిర్వహించేవారు. దీంతో అక్కడికి శాంపిల్ పంపి, రిజల్ట్ వచ్చేదాకా రోగి పరిస్థితి విషమించేది. కొన్నిసార్లు పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. దీన్ని గమనించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రూ.1.50కోట్లతో ఆర్టీపీసీఆర్ టెస్టుల కేంద్రాన్ని జిల్లా దవాఖానలో ఏర్పాటు చేయించారు. దీంతో ప్రతిరోజూ గరిష్ఠంగా 200 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 236 టెస్టులు చేశారు.
డయాలసిస్ సేవలు..
జిల్లా డయాలసిస్ రోగులు నిత్యం ఇతర జిల్లాలకు వెళ్లి పరీక్షలు చేసుకోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వ దవాఖానలో జనవరి 2, 2018లో మొదటగా ఐదు డయాలసిస్ బెడ్లను ఏర్పాటు చేయించారు. రోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడంతో అదనంగా డిసెంబర్ 12, 2020లో మరో ఐదు బెడ్లను మంజూరు చేయించారు. ఇప్పటి వరకు 219 మందికి డయాలసిస్ చేశారు. జిల్లాలో 78 మంది డయాలసిస్ రోగులకు ఉచితంగా సేవలు అందుతున్నాయి. వారానికి మూడు సార్లు రోగులు డయాలసిస్ చేయించుకుంటున్నారు.
8500 మంది రోగులు.. లక్షన్నర పరీక్షలు..
సర్కారు దవాఖానకు వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందాలంటే వివిధ పరీక్షలు తప్పనిసరి. ముఖ్యంగా రక్త పరీక్షల ద్వారా రోగం నిర్ధారణ అయితే దానికి తగిన ట్రీట్మెంట్ అందించవచ్చు. రోగి త్వరగా కోలుకుని ఇంటికి క్షేమంగా వెళ్లే అవకాశం ఉంది. పేదలకు ఆర్థిక భారం కావద్దన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత టీ డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి 22న ప్రారంభమైన తెలంగాణ డయాగ్నోస్టిక్ ల్యాబ్లో ఉచితంగా 57 రకాలకు చెందిన పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 8500 మంది రోగులకు 1,62,627 రకాల పరీక్షలు నిర్వహించారు.
ప్రారంభానికి సిద్ధంగా ప్రాణ వాయువు ప్లాంట్..
ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఆక్సిజన్ అత్యవసరం. ఇది అందుబాటులో లేకపోవడంతో అనేక మంది అకాల మరణం చెందుతున్నారు. ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులు ఆక్సిజన్ లేకపోవడంతో మరణించవద్దన్న ఉద్దేశంతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కొవిడ్ రోగులతో పాటు మామూలు రోగులకు అత్యవసర సమయంలో ఆక్సిజన్ అందించేం దుకు 1000 లీటర్ల సామర్థ్యంతో దవాఖాన ఆవరణలో ప్లాంట్ నిర్మిస్తున్నారు. పనులు వేగంగా పూర్తికాగా.. త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది.
దవాఖాన సేవలు సద్వినియోగం చేసుకోండి..
నిర్మల్ జిల్లా దవాఖానను కార్పొరేట్ తరహాలో అభివృద్ధి చేశారు. వెంటిలేటర్, డయాలసిస్, ఈసీజీ సేవలతో పాటు వివిధ రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కృషితో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇటీవల 57 రకాల ఉచిత పరీక్షల విభాగాన్ని అందుబా టులోకి తీసుకొచ్చారు. ప్రాణాపాయ స్థితిలో రోగులకు అందించే ఆక్సిజన్ ప్లాంట్ సిద్ధమవుతున్నది. ఆర్టీపీసీఆర్ టెస్టులు సైతం ఇక్కడే చేస్తున్నాం. ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజలు అపోహ వీడి వైద్యం చేసుకోండి.