ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ సత్ఫలితాలనిస్తున్నది. రెండు జిల్లాల్లో ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తున్నది. మొత్తం 313 వైద్య బృందాల ద్వారా పట్టణాలు, గ్రామాల్లో టీకా కార్యక్రమాన్ని చేపట్టగా, ప్రజానీకం సద్వినియోగం చేసుకుంటున్నది. గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్సీలు, సబ్సెంటర్ల ద్వారా టీకా అందిస్తుండగా, మరికొన్ని చోట్ల ప్రత్యేక బృందాలు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నాయి. కాగా, అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో ఇప్పటికే 24 గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయింది.
ఆదిలాబాద్, సెప్టెంబర్ 22 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కొవిడ్ వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న అధికారులు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఈ నెల 16 నుంచి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. రెండు జిల్లాల్లో వైద్యశాఖతో పాటు మెప్మా, డీఆర్డీఏ, పంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బందితో 313 బృందాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 207, నిర్మల్లో 106 టీంలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి.
ఆశ కార్యకర్తలు, మెప్మా, డీఆర్డీఏ సిబ్బంది గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. టీకా తీసుకోవడంతో కలిగే ప్రయోజనాలను తెలియజేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తమ వార్డులు, గ్రామాల్లో ప్రజలు టీకా తీసుకునేలా స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంట్లో 18 ఏండ్లు నిండి టీకా తీసుకోని వారు ఉంటే వారికి వ్యాక్సిన్ సెంటర్కు తీసుకెళ్లి ఇప్పిస్తున్నారు. ఆధార్కార్డు వివరాలను కొవిన్యాప్లో నమోదు చేస్తున్నారు. మొదటి డోస్ తీసుకున్న వారికి నిర్దేశిత సమయం పూర్తయిన తర్వాత రెండో డోస్ తీసుకునేలా చూస్తున్నారు. అర్హులైన వారందరూ టీకా తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
24 గ్రామాల్లో వందశాతం ..
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 24 గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ మండలం హత్తిగూడ, ముక్రా(కే), తాంసి మండలం పొన్నారి, అంబుగాం, బండలనాగాపూర్, ఉట్నూర్ మండలం గోదారిగూడ, గాదిగూడ మండలం లోకారి(బీ), బూలకాసా,రోమన్కాస, లొద్దిగూడ, పావునూర్, ఝరి, పిప్రి, సాంగ్వి, రాంపూర్, బేల మండలం గూడ, కొద్దూర్, జైనథ్ మండలం కరంజి (టీ), భీంపూర్ మండలం గుబిడి, నిర్మల్ జిల్లాలో బాసర మండలం తరోడ, ఎడ్బిడ్, నర్సాపూర్ (జీ) మండలం బీర్వల్లి, నిర్మల్ మండలం అక్కాపూర్, సోన్ మండలం మదాపూర్లో అర్హులైన వారందరికీ టీకా వేసినట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 207 టీకా కేంద్రాల్లో రోజుకు 100 మందికి, నిర్మల్ జిల్లాలో 106 కేంద్రాల్లో రోజుకు 200 మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు చేపట్టారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు 3,63,917 మందికి టీకా వేయగా, వీరిలో 2,53,152 ఫస్ట్ డోస్, 1,10,765 రెండు డోసులు టీకా తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 2,90,233కి టీకా వేయగా వీరిలో 2,39,853 మంది మొదటి డోస్, 50,380 మంది రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో డ్రైవ్ ప్రారంభమైన తర్వాత మంగళవారం వైద్య సిబ్బంది రికార్డు స్థాయిలో 23,270 మందికి టీకా వేశారు.
రాములు తాత టీకా వేసుకున్నడు..
ఈ తాతపేరు బొలిపెల్లి రాములు. గుబ్డి గ్రామం. 90 ఏండ్లు దాటినయి. గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ శిబిరంలో ఉత్సాహంగా టీకా వేయించుకున్నడు. రాములుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అట్లనే మనువళ్లు, మునిమనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. రాములు తాతనే మంచిగ టీకా వేయించుకున్నడని చెప్పి, గ్రామంలో ఇప్పుడు అందరూ ధైర్యంగా ముందుకు వచ్చి శిబిరంలా టీకా వేయించుకున్నరు. నా వయసు అయిపోతున్నది గనీ ఊరంతా మంచిగుండాలనే నేను కూడా పోయి ధైర్యంగా టీకా వేయించుకున్ననని రాములు తాత నవ్వుతూ చెబుతున్నడు.
అర్హులందరూ టీకా తీసుకోవాలి..
జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్కు ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఆదిలాబాద్లో 49, గ్రామాల్లో, 158 సెంటర్లను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ వేస్తు న్నాం. అర్హులైన వారందరూ టీకా తీసుకోవాలి. ఆధార్కార్డు తీసుకొని కేంద్రానికి వస్తే సిబ్బంది టీకా వేస్తారు. పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు టీకా తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. – నరేందర్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి, ఆదిలాబాద్
మా ఊరోళ్లందరూ టీకా వేసుకున్నరు..
మా గుబ్డి గ్రామం కొత్త పంచాయతీ. జిల్లా కేంద్రానికి యాభైకిలోమీటర్ల దూరంల పెన్గంగ ఒడ్డున ఉన్నది. మొదట్ల గీ కరోనా టీకాలు తీస్కునేతందుకు భయపడిన్రు. ఇగ నేను, సర్పంచ్ ప్రతాప్, ఏఎన్ఎం సుజాత, యూత్ పిలగాండ్లతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ టీకాలు వేసుకోవాల్నని చెప్పినం. ముందుగాల సర్పంచు, నేను మా కుటుంబంల అందరం టీకాలు తీసుకున్నం. దీంతోనే ఇగ ఒక్కొక్కలూ టీకా వేసుకునేందుకు దారి పట్టిన్రు. మొన్న మూడు రోజులు మా గ్రామంలకే వచ్చి అందరికీ టీకాలు వేసిన్రు. మొత్తం 250 మంది టీకా తీసుకున్నరు. మా గ్రామంల వంద శాతం టీకా వేసుకున్నరు. సర్కారోళ్లు చెప్పిన జాగ్రతలన్నీ పాటిస్తున్నం.
-ఆకం శ్రీనివాస్ యాదవ్, ఉపసర్పంచ్, గుబ్డి పంచాయతీ (భీంపూర్ మండలం)