మామడ, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ వద్ద గోదావరిపై నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీ నిర్వాసితులైన 488 మంది రైతులకు రూ. 38. 61 కోట్ల పరిహారాన్ని స్థానిక గంగపుత్ర ఫంక్షన్ హాల్లో ముథోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి అందజేశారు. ముందుగా 50 మంది రైతులకు చెక్కులను అందించగా, మిగతా వారికి గురువారం ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుతో మాట్లాడి నష్టపరిహారం త్వరగా అందేలా చూసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో ఖానాపూర్ నియోజకవర్గంలో 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుందన్నారు. జూన్ వరకు ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు.
నాగదేవత ఆలయం ముంపునకు గురికావడంతో, సమీపంలోని 5 ఎకరాల స్థలంలో రూ.35లక్షలతో ఆలయ పునర్నిర్మాణం చేపడుతామని, దేవాదాయ శాఖ నుంచి మరికొన్ని నిధులను మంజూరు చేస్తానని హామీనిచ్చారు. చెక్కులు అందుకున్న నిర్వాసితులందరూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, ఇరిగేషన్ ఈఈ రామారావు, ఎస్ఈ సుశీల్కుమార్ దేశ్పాండే, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్రవంతి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, సర్పంచ్ భూమేశ్వర్, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, వైఎస్ ఎంపీపీ లింగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ హరీశ్రావు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్గౌడ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, నాయకులు నవీన్రావు, జైసింగ్, తహసీల్దార్ కిరణ్మయి, ఎంపీడీవో రమేశ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి
సదర్మాట్ మినీ బ్యారేజ్ నిర్మాణంలో భూములు కోల్పోయిన మాకు నష్టపరిహారం మూడు నెలల్లో చెల్లిస్తానని మంత్రి గతంలో మాట ఇచ్చిన్రు. ఇచ్చినట్లే ఆయన మాట నిలబెట్టుకున్నరు. చాలా సంతోషంగా ఉంది. సకాలంలో నష్టపరిహారం చెక్కులు అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. బ్యారేజీ నిర్మాణంలో నాది 16 గంటల భూమి పోతున్నది. ఇప్పుడు నాకు రూ.4 లక్షల 27 వేలు వచ్చినయి.
-నూకపెల్లి నర్సవ్వ, కమల్కోట్
చాలా సంతోషంగా ఉంది
బ్యారేజీలో భూములు కోల్పోయి అనేక ఇబ్బందులతో సతమతమవుతున్న మాకు నష్టపరిహారం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటున్నది. మంత్రి అల్లోల కూడా నష్టపరిహారాన్ని మాకు ఇప్పించేందుకు ఎంతో ప్రయత్నం చేసిన్రు. కొంత ఆలస్యమైనా, అందరినీ ఒప్పించి మాకు చెక్కులు ఇప్పించిన మంత్రి అల్లోలకు మేమంతా రుణపడి ఉంటం. అవసరమైన పనులకు మాకు ఈ డబ్బులు ఎంతో ఉపయోగపడతయి.
-పత్తిరి రమేశ్, కమల్కోట్
కష్టంలో ఆదుకున్న దేవుళ్లు
కష్టకాలంలో మమ్మల్ని సీఎం కేసీఆర్ సారు, మంత్రి అల్లోల ఆదుకున్నరు. బ్యారేజీలో భూములు కోల్పోయి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నం. మూడు నెలల నుంచి ఆయన అందరినీ ఒప్పించి ఈ డబ్బులు మాకు అందేలా ఎంతో కష్టపడ్డరు. భూములు పోతే ఎంతో బాధ ఉంటది. మళ్లీ వేరే చోట ఏదో పని చేసుకు నేందుకు ఈ పైసలు ఉపయోగపడతయి.
-పొట్టెంక సునీత, పొన్కల్