కార్యకర్తలే టీఆర్ఎస్కు శ్రీరామరక్ష అని పార్టీ కమిటీల పర్యవేక్షకుడు, నిజామాబాద్ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పట్టణ, మండల, అనుబంధ కమిటీల ఏర్పాటు కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్తో కలిసి మంగళవారం పాల్గొన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేద్దామని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 21 : టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే శ్రీరామరక్ష అని పార్టీ కమిటీల ఏర్పాటు పర్యవేక్షకుడు, నిజామాబాద్ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పట్టణ, మండల, అనుబంధ కమిటీల ఏర్పాటు కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్తో కలిసి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. గ్రామ, వార్డు, మండల కమిటీలకు ఎన్నికైన నాయకులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సర్కారు తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయాలన్నారు. ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శలకు సరైన రీతిలో సమాధానాలిస్తూ ప్రజలకు నిజాలు తెలియజేయాలని తెలిపారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని, సిద్ధాంతాలను పాటించడం వల్లే నేడు రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నదన్నారు.
కమిటీలను పారదర్శకంగా కార్యకర్తల సమక్షంలో ఎన్నుకున్నట్లు, సభ్యత్వ నమోదులోనూ ఆదిలాబాద్ నియోజకవర్గం ముందున్నదని పేర్కొన్నారు. ఏ ప్రాంతీయ పార్టీకీ కూడా ఢిల్లీలో కార్యాలయం లేదని, కానీ కేసీఆర్ కృషి, పాలన వల్ల నేడు టీఆర్ఎస్ భవన్ను నిర్మిస్తున్నామని వెల్లడించారు. అనంతరం అరిగెల నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. 2014 నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని గుర్తు చేశారు. కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలన్నారు. అర్హులైన పేదలందరికీ ఫలాలు అందేలా చూడాలని తెలిపారు.
ఆ తర్వాత ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. గ్రామ, వార్డు కమిటీల్లో చోటు దక్కలేదని బాధపడవద్దని, మరో పదవి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో 63 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ ఏదీ లేదన్నారు. పార్టీ కార్యకర్తలకు కండువాలే ఆయుధమని, ప్రతిపక్షాలు చెప్పే అబద్దాలను ప్రజలు నమ్మకుండా చూడాలని తెలిపారు. అనంతరం పట్టణ, మండలాల కమిటీలను ప్రకటించారు. అనంతరం వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, మాజీ ఎంపీ నగేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్, రోకండ్ల రమేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, సాజీదొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
కార్యవర్గ సభ్యులతో సమావేశం..
బోథ్, సెప్టెంబర్ 21 : ఆదిలాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బోథ్ నియోజకవర్గ పరిధి తొమ్మిది మండలాల కమిటీ కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. వాటి గురించి ప్రజలకు తెలపాల్సిన బాధ్యత కమిటీలపై ఉందని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, దళిత బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు పింఛన్లు ఇలా చెప్పుకుంటూపోతే లెక్కకు మించి పథకాలు అమలవుతున్నాయన్నారు. గతంలో మాదిరిగా దళారులు, పైరవీలకు తావులేకుండా నేరుగా అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్న తీరును ప్రజలకు నొక్కి చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు.
నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు టీఆర్ఎస్ కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం నూతన కమిటీలు పనిచేయాలని సూచించారు. అందరినీ సమన్వయపర్చుకుంటూ ప్రభుత్వ పనితీరు, గత ప్రభుత్వాల తీరును ప్రజలకు విడమర్చి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో తొమ్మిది మండలాల కన్వీనర్లు, కార్యదర్శులు, కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు.