ఆదిలాబాద్ జిల్లాలో డెంగీ నివారణకు వైద్యశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వ్యాధికి కారణమవుతున్న దోమలు వృద్ధి చెందకుం డా కార్యక్రమాలు చేపట్టారు. ఇండ్లు, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడడంతోపాటు ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ దవాఖానల్లో అనుమానితులకు ఎలిసా పరీక్షలు నిర్వహించిన తర్వాత వ్యాధి నిర్ధారణ చేయాలని వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. రిమ్స్లో బాధితులకు ప్లేట్లెట్స్ ఎక్కించడంతోపాటు చికిత్సలు అందించడానికి ఏర్పాట్లు చేశారు. డెంగీ నివారణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, దోమలు పెరుగకుండా చూడాలని వైద్యశాఖ అధికారులు కోరుతున్నారు.
ఆదిలాబాద్, సెప్టెంబర్ 14 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్స్, డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో అధికారులు వ్యాధి నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. జ్వర పీడీతులకు మలేరియా, డెంగీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. సీజన్లో ఇప్పటి వరకు 3,039 మంది అనుమానితుల శాంపిళ్లను సేకరించగా, 129 పాజిటివ్ కేసులు న మోదయ్యాయి. దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి రావడంతో వైద్య, పంచాయతీ, మున్సిపల్ శాఖల అధికారులు వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా ఉంటుండడంతో ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని 49 వార్డులకు 6 బృందాలను ఏర్పాటు చేశారు. ఇం దులో మున్సిపల్, మెప్మా, వైద్య సిబ్బంది ఉంటారు. వీరు ప్రతి వార్డులో తిరుగుతూ దోమలు వృద్ధి చెందకుండా చూడడంతో పాటు డెంగీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్నారు. వారానికి ఒకసారి డ్రైడే చేపట్టాలని సూచిస్తున్నారు. ఇంట్లో ఎవరైనా జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారి వివరాలు సేకరించి వైద్యం అందిస్తారు. దోమ లార్వాలను గుర్తించి వాటి నివారణకు పిచికారీ చేస్తారు. వైద్యశాఖ అధికారులు 20 మంది బ్రీడర్స్ చెకర్స్ను నియమించారు. గ్రామాల్లో సైతం పంచాయతీ, అంగన్వాడీ, వైద్యసిబ్బంది ఇంటింటా తిరుగుతూ దోమల నివారణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
అవసరమైన వారికి చికిత్స..
డెంగీ పాజిటివ్ వచ్చిన వారికి వైద్యశాఖ అధికారులు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ఇందుకోసం రిమ్స్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రైవేట్ దవాఖానల్లో సైతం ర్యాపిడ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించి , వ్యాధిని నిర్ధారించకుండా అనుమానితుల శాంపిళ్లను రిమ్స్ మైక్రోబయాలజీ విభాగానికి పంపించి ఎలిసా పరీక్షలు ద్వారా డెంగీ నిర్ధారించాలని వైద్యశాఖ ఉన్నతాధికారులు ప్రైవేట్ దవాఖానల నిర్వాహకులకు సూచించారు. పాజిటివ్ వచ్చిన వారు డీహెచ్ఎఫ్ స్టేజీలోకి వస్తే రిమ్స్లో ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నట్లు వైద్యాశాఖ అధికారులు తెలిపారు. జ్వరాలు వచ్చిన గ్రామాలు, పట్టణాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. జ్వరం వచ్చిన వారు పోషకాహారం, పండ్లు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
దోమల నివారణ ఇలా..
ఇండ్లలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి
ఇండ్లు, పరిసరాల్లో పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పగిలిన సీసాలు, వాడిన టీ కప్పులు, ఇతర నీటి నిల్వలు ఉండే వస్తువులు తొలగించాలి.
వారానికి ఒకసారి నీటి కుళాయిని శుభ్రపర్చాలి
కూలర్లు, ఫ్రీజ్లు, ఏసీల్లో నీరు నిల్వకుండా చూడాలి.
ఇండ్లలోకి దోమలు రాకుండా తలుపులు, కిటికీలకు జాలీలు బిగించుకోవాలి
ఇంటి పరిసరాల్లోని గుంతల్లో నీటి నిల్వలు ఉండకుండా చూడాలి
దోమలు కుట్టకుండా నిండుగా దుస్తులు ధరించాలి. మాస్కిటో కాయిల్స్ వాడాలి.
దోమలు లేకుండా చూసుకోవాలి
పట్టణాలు, గ్రామాల్లో స్థానికులు ఇండ్లు, రిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలి. వైద్య, పంచాయతీ, మున్సిపల్, ఇతర శాఖల ద్వారా వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. వారానికి రెండు సార్లు డ్రైడే నిర్వహించి నీటి నిల్వలు లేకుండా చేయాలి. అనుమానితులకు పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తున్నాం.