వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులను సాంకేతిక సాగు వైపు మళ్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. సంప్రదాయ పంటలు పండిస్తూ ఆటుపోట్లను ఎదుర్కొంటున్న వారు కూరగాయలు, ఇతర లాభదాయకమైన పంటలు వేసేలా ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా రైతులకు ఆధునిక సాగుపై శిక్షణ ఇవ్వడంతోపాటు క్షేత్రస్థాయి పర్యటనలకు తీసుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నది. ఇందుకోసం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు రూ.79.50 లక్షలు కేటాయించగా.. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, ఇతరులకు 90 శాతం సబ్సిడీపై పరికరాలు అందజేయనున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ) :జిల్లాలో ప్రస్తుతం సుమారు 2వేల హెక్టార్లలో రైతులు కూరగాయలు సాగుచేస్తున్నారు.. చిన్న, సన్నకారు రైతులు అవసరాల మేరకు కూరగాయలు సాగుచేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా టమాట సాగు చేస్తున్నారు. మిగతా కూరగాయలు కాకర 110 హెక్టార్లు, సోర 127, వంకాయ 322, మిరప 238, దోస 50, బెండ 140, ఉల్లి 300, ముల్లంగి 10, పర్వల్ 30, బీర 50, టమాట 690 హెక్టార్లలో సాగుచేస్తున్నారు. ఆసిఫాబాద్ మండలం కొండపల్లి, ఎల్లారం, అడ, వాడిగూడ, వాంకిడి మండలం కిర్డి, జైత్పూర్, బెండార, కన్నెర్గాం, కెరమెరి మండలంలో రింగన్గూడ, అనార్పల్లి, ఖైరీ, కెరమెరి, మోడీ, ఝరి, సావర్ఖేడ్, రెబ్బెన మండలం గంగాపూర్, కాగజ్గనర్ మండలం నజ్రుల్గనర్, బెంగాలీ క్యాంపుల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. వ్యవసాయ బోర్లు, బావులు ఉన్న రైతులు కూరగాయాల సాగువైపు మొగ్గుచూతున్నారు. స్థానిక అవసరాలకు తగినట్లుగా కూరగాయలు పండించకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. దీంతో స్థానికంగా కూరగాయలకు మంచి డిమాండ్ పెరిగి ధరలు పెరిగిపోతున్నాయి.
సాగు పెరిగితేనే సమస్యకు పరిష్కారం..
జిల్లాలో అవసరానికి తగినట్లుగా కూరగాయల సాగువైపు రైతులను మళ్లించేందుకు ఉద్యాన వనశాఖ ద్వారా ప్రభుత్వం చర్యలు చేట్టింది. కూరగాయల సాగుకు ముందుకు వచ్చే రైతులకు ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీపై, ఇతరులకు 90 శాతం సబ్సిడీపై స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. కూరగాయలు సాగుచేసే రైతులకు పంట సస్యరక్షణ చర్యలు తీసుకునే విధానాలపై అవగాహన కూడా కల్పిస్తారు. పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న పల్లెల్లో కూరగాయల కాలనీలను ముందుగా ఏర్పాటు చేసి రైతులకు వ్యవసాయ పరికరాలతోపాటు, విత్తనాలు సబ్సిడీపై అందిస్తారు. వెజిటేబుల్ కాలనీలను ఉద్యాన వనశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు.
సద్వినియోగం చేసుకుంటే ప్రయోజనం..
అగ్రికల్చర్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ(ఆత్మ) ద్వారా సాగులో సాంకేతిక విధానాలను నేర్పించేందుకు ఇచ్చే శిక్షణలను రైతులు సద్వినియోగం చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆధునిక సాగు పద్ధతులు చేపట్టే విధానాలపై రైతులకు ఆత్మ ద్వారా శిక్షణ ఇస్తారు. ఇందుకోసం జిల్లాలోని రైతులకు శిక్షణ ఇచ్చేందుకు రూ. 79.5 లక్షలను ప్ర భుత్వం కేటాయించింది. దీని ద్వారా ఇచ్చే శిక్షణలతో రైతులు సాగులో మెళకువలు నేర్చుకొని ఆధునిక పద్ధతుల్లో కూరగాయల సాగుతోపాటు, ఇతర లాభదాయకమైన పంటలను సాగుచేయడం తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.