నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 14: ప్రభుత్వపరంగా ఏ అభివృద్ధి పని చేయాలన్నా ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకం. భారతదేశానికి చెందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ప్రతి యేటా సెప్టెంబర్ 15న ఇంజినీర్స్డేను నిర్వహిస్తున్నది. ఆనాటి ఇంజినీర్ల ప్రతిభకు పట్టం కట్టేలా చారిత్రాత్మక కట్టడాలు, వారి ప్రతిభకు అద్దంపట్టే ఎన్నో అద్భుతాలు ఇప్పటికీ జనాలను ఆలోచింపజేస్తున్నాయి. ఓ బ్రిడ్జి, చెరు వు, ప్రాజెక్టు ఇలా ఏవైనా ఇంజినీరింగ్ విభాగంతో ముడిపడి ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున ఇంజినీర్ల పోస్టులను భర్తీ చేసింది. 2015-16లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం 2016-17, 2018-19 సంవత్సరాల్లో తెలంగాణలో ఖాళీగా ఉన్న ఇంజినీర్ల పోస్టులను భర్తీ చేసింది. ఇందులో పంచాయతీరాజ్, రో డ్డు భవనాల శాఖ, మున్సిపల్, విద్యుత్, భూగర్భజలశాఖ, జలవనరులశాఖ, విద్యాశాఖ, క్వాలిటీ కంట్రోల్, తదితర వాటిలో పెద్ద ఎత్తున యువత ఉద్యోగాలు సాధించారు. ఒక్క విద్యుత్శాఖలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 52 మంది అసిస్టెంట్ ఇం జినీర్లుగా చేరగా.. పంచాయతీరాజ్లో 19 మంది, మున్సిపల్ లో 18 మంది, భూగర్భజలశాఖలో నలుగురు, క్వాలిటీ కంట్రోల్లో 8 మంది, జలవనరులశాఖలో 32 మంది, ఆర్అండ్బీలో 8 మంది, మిగతాశాఖల్లో మరో 25 మంది ఉద్యోగాల్లో చేరినట్లు అధికారులు పేర్కొంటున్నారు. నేడు ఇంజినీర్స్ డే సందర్భంగా విధుల్లో ఉన్న ఇంజినీర్ల మనోగతం వారి మాటల్లోనే..
గంటల్లో అడిగిన రిపోర్టు ఇస్తున్నాను..
మాది ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండలం సొనాల గ్రామం. అమ్మనాన్నలు చిన్నప్పటి నుంచి నన్ను కష్టపడి చదివించారు. హైదరాబాద్లో 2017లో సివిల్ ఇంజినీరింగ్ చదువుతుండగానే టీఎస్పీఎస్సీ ద్వారా ఏఈ నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు చేసి పరీక్ష రాయగా.. 2018లో మిషన్ భగీరథ పథకంలో దిలావర్పూర్ ఏఈగా ఉద్యోగం వచ్చింది. అప్పటి వరకు నాకు చదువు తప్పా మిషన్ భగీరథ గురించి తెలియదు. కంప్యూటర్ పరిజ్ఞానంతో దిలావర్పూర్ మండలంలో మిషన్ భగీరథ పనులను సత్వరం పూర్తి చేయడమే కాకుండా అడిగిన రిపోర్టును వెంటనే ప్రభుత్వానికి ఇస్తున్నా.
జీవితంలో మరచిపోలేని మధురానుభూతి..
మాది మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణం. సివిల్ ఇంజినీరింగ్ పూర్తి కాగానే తెలంగాణ ప్రభుత్వం ఇంజినీర్ల భర్తీ ప్రక్రియ చేపట్టడంతో ఉద్యోగం వచ్చింది. నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏఈగా 2016లో విధుల్లో చేరిన. నాకు అప్పటి వరకు ఇంజినీరింగ్ విభాగంలో ఏ పనులు ఎలా చేస్తారో పరిజ్ఞానం లేదు. మున్సిపల్శాఖలో డీఈగా పని చేస్తున్న ఓ అధికారి నాకు విధుల నిర్వహణపై పూర్తి అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయికి తీసుకెళ్లి నేర్పించారు. తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రగతికి ప్రత్యేక నిధులను కేటాయిస్తున్న నేపథ్యంలో పట్టణంలో ఇంజినీరింగ్ పరంగా ఏ పనులు చేసినా సకాలంలో నాణ్యతగా చేస్తున్నాం.
భూగర్భజలాలను పక్కాగా లెక్కిస్తున్నాం..
నేను నిర్మల్ భూగర్భజలాశాఖలో అసిస్టెంట్ హైడ్రాలజీ ఏఈగా విధులు నిర్వహిస్తున్నా. మాది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్నగర్ పట్టణం. నేను బాసరలోని ట్రిపుల్ ఐటీలో ఆరేండ్ల పాటు సివిల్ డిప్లొమా ఇంజినీరింగ్చదివి 2015లో పూర్తి చేశా. 2016లో ఉద్యోగం వచ్చింది. నిర్మల్ పట్టణంలోని భూగర్భజలశాఖలో అసిస్టెంట్ హైడ్రాలజీ ఇంజినీరుగా విధులు నిర్వహిస్తున్నా. గతంలో మీటర్ల ఆధారంగా భూగర్భజలాలు లెక్కించేవారం. ఇటీవల కొత్త టెక్నాలజీ సాయంతో డిజిటల్, వాటర్ లెవలింగ్ సిస్టంను 45 చోట్ల అమలు చేసి ప్రతిరోజూ ఆన్లైన్ ద్వారా సాంకేతిక విజ్ఞానంతో పక్కాగా లెక్కిస్తున్నాం. నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం.
ఇంటింటికీ మిషన్ భగీరథ నీరిచ్చాం..
మాది ఆదిలాబాద్ జిల్లాలోని టీచర్స్ కాలనీ. నేను సివిల్ ఇంజినీరింగ్ పూ ర్తి చేయగానే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో దరఖాస్తు చేసుకున్నా. 2017లో పరీక్ష రాయగా..2018లో ఫలితాలు వెలువడ్డాయి. ప్రతిభ ఆధారంగా మిషన్ భగీరథ శాఖలో ఏఈగా ఉద్యోగం వచ్చింది. తానూర్ మండలంలో విధుల్లో చేరా. ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీరు అందించేందుకు కష్టపడి పని చేయడంతో ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చింది.
మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించా..
మాది నిర్మల్ పట్టణం. మా అమ్మనాన్నలు ప్రభుత్వ ఉద్యోగులు. హైదరాబాద్లో సివిల్ ఇంజినీరింగ్ చదివా. 2015లో సివిల్ పూర్తి కాగానే గ్రూపు పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా పంచాయతీరాజ్లో ఇంజినీర్గా ఉద్యోగం వచ్చింది. మొదట ఆదిలా బాద్లో మూడు సంవత్సరాలు పాటు పని చేసి ఇటీవల నిర్మల్ పంచాయతీరాజ్ శాఖకు వచ్చా. డ్రాయింగ్బ్రాంచ్ బిల్స్ ఏఈగా విధులు నిర్వహి స్తున్నా. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో డ్రాయింగ్ డ్రాప్టు ద్వారా ఎస్టిమేషన్లను తయారు చేస్తున్నా. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామినైనందుకు చాలా సంతోషంగా ఉంది.
ప్రభుత్వ లక్ష్యాన్ని సాధిస్తున్నాం..
నా పేరు ఐ.ప్రణవి, మాది ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలం. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పదోతరగతి పూర్తి కాగానే మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేశా. ఆ తర్వాత ఇంజినీరింగ్ డిప్లొమా చదివా. 2017లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి కాగానే విద్యుత్శాఖలో ఏఈల పోస్టుకు నోటిఫికేషన్ వచ్చింది. తొలి ప్రయత్నంలో ఉద్యోగం సాధించా. నిర్మల్ పట్టణంలోని పవర్ ట్రాన్స్మిషన్ మెయింటెనెన్స్లో అసిస్టెంట్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నా. ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించే లక్ష్యాన్ని అమలు చేస్తున్నాం.
కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం..
మాది సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామం. 2015లో సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా తీసుకున్నా. ఆ తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో మొదటి ప్రయత్నంలోనే ఆర్అండ్బీ శాఖలో ఏఈఈగా ఉద్యోగం వచ్చింది. గతంలో రోడ్లు నిర్మించేటప్పుడు ఇంజినీర్లు పాత టెక్నాలజీ మిషనరీని ఉపయోగించేవారు. ఇప్పుడు మార్కెట్లో కొత్త మిషన్ల ఆధారంగా టైంబాండ్ ప్రోగ్రాం కింద కొత్త రోడ్లను ఎస్టిమేషన్ చేసి ఆధునిక టెక్నాలజీతో నాణ్యతగా నిర్మిస్తున్నాం. సివిల్ ఇంజినీరింగ్ చదవడంతోనే నాకు ఉద్యోగం వచ్చింది.