సోన్, ఆగస్టు 17 : డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చిన లబ్ధిదారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మంత్రి సొంతగ్రామమైన నిర్మల్ మండలం ఎల్లపెల్లిలో రూ. 1.20 కోట్లతో నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇండ్లను మంగళవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదోడికి గూడు కల్పించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదోడికి డబుల్బెడ్రూం ఉండాలనే ఉద్దేశంతో సుమారు రూ.5.50 లక్షలతో ఒక డబుల్బెడ్రూం ఇల్లు నిర్మించి ఇచ్చామన్నారు. అన్ని సౌకర్యాలతో ఇంటిని నిర్మించి ఇవ్వడంతో చాలా కుటుంబాల్లో ఇబ్బందులు దూరమయ్యాయని పేర్కొన్నారు. అన్ని సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి పేదలకు ఇచ్చినట్లు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో రెండు వేల డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తున్నదని స్పష్టంచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ అమలు చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నర్మదాముత్యంరెడ్డి, సర్పంచ్ అల్లోల రవీందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అల్లోల మహేశ్రెడ్డి, మాజీ ఎఫ్ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్రెడ్డి, ఆర్డీవో రాథోడ్ రమేశ్, తహసీల్దార్ సుభాష్చందర్, ఎంపీడీవో సాయిరాం, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మల్లేశ్యాదవ్, నాయకులు గాండ్ల విలాస్, సూరపు సాయన్న, కుంట పద్మాకర్, నవాత్ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
పాత ఇల్లు ఊరుస్తుండే..
మాకు పాత ఇల్లు ఉంది. వానకాలమైతే నిద్రలేని రాత్రుళ్లు గడిపేటోళ్లం. ఎప్పుడు వర్షం పడినా ఊరుస్తుండే.. ఇప్పుడు కొత్త ఇల్లు ఇవ్వడంతో ఆ బాధ పోయింది. నాకు ఒక బాబు. మా ఆయన కూలీ పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నడు. ఇల్లు కట్టుకుందామంటే పైసలే లేకపాయే. ఎన్నో ఏండ్ల సంది మేము పాత ఇంట్లనే ఉంటున్నం. ఇప్పుడు రెండు పడక గదుల ఇల్లు ఇవ్వడంతో సంతోషంగా ఉంది. మా ఇంటి బాధ పోయింది. సీఎం కేసీఆర్ సార్కు ధన్యవాదాలు.
ఇంటి కోసం మా ఆయన దేశం పోయిండు..
మేము ఇంటిని కిరాయికి తీసుకొని ఉంటున్నం. నెలకు రూ.1500 కిరాయి. మా కష్టాలు ఏం జెప్పాలే. మాకు ఇద్దరు కొడుకులు. కూలీ పని చేసుకొని బతుకుతం. కొత్త ఇల్లు కట్టుకుందామని అనుకున్నం. కూలీ పని చేస్తే పొట్ట, బట్టకే సరిపోతున్నయ్. ఇక ఇల్లు ఏం కట్టుకుంటం. అందుకే మా ఆయన దేశం పోయి నాలుగేండ్లు అయ్యింది. ఇప్పుడు కొత్త ఇల్లు ప్రభుత్వమే ఇవ్వడంతో ఆయనను రమ్మన్న. కొత్త ఇల్లు ఇచ్చిన్రని చెప్పిన. ఆయన మస్తు సంబురవడ్డడు.
రూ.25 లక్షల్లాంటి భవనం ఇచ్చారు..
ఈ రోజుల్లో ఇల్లు నిర్మించాలంటే చాలా డబ్బులు కావాలి. నేను కూలీ పని చేసి కుటుంబాన్ని పోషించుకుంటా. ఇల్లు కట్టలేని పరిస్థితి మాది. ప్రభుత్వం డబుల్బెడ్ రూం ఇల్లు నిర్మించి ఇవ్వడం నాకు సంతోషంగా ఉంది. ఇల్లు బాగానే ఉంది. ప్రభుత్వం ఇంత ఖర్చు చేసి పేదవారికి ఇల్లు కట్టిచ్చి ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. రూ. 25 లక్షల్లాంటి భవనం ఇచ్చారు. మా కుటుంబసభ్యులు ఎప్పుడూ ప్రభుత్వానికి రుణపడి ఉంటారు.
పడుకుందామంటే జాగా లేకుండే..
మా ఆయన కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. నాకు ఇల్లు చిన్నగా ఉంది. నా కొడుకు వ్యవసాయ కూలీ పనులకు పోతడు. ఆ పైసలతోటే మా కుటుంబం గడుస్తది. ఇల్లు కట్టుకుం దామనే ఆలోచన చేస్తేనే భయమేసింది. సర్కారోళ్లు కొత్త ఇండ్లు ఇస్తున్నరని తెలిసి దరఖాస్తు చేసుకున్న . అదృష్టం కొద్దీ ఇల్లు అచ్చింది. నాకు సంతోషమనిపించింది. మాకు ఇంకా ఏమీ బాధలు లేవు. మేము ఇల్లు కట్టుకోవాలంటే ఇంత డబ్బు యాడికెళ్లి తేవాలే. సీఎం కేసీఆర్, మంత్రి అల్లోలకు కృతజ్ఞతలు.
పాత ఇల్లుండే..
నాకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. అమ్మ, నాన్నతో కలిసి పాత ఇంట్లో ఉండేవాళ్లం. నేను ట్రాక్టర్ డ్రైవర్గా పని చేసి కుటుంబాన్ని పోషిస్తా. అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. పాత ఇల్లు కావడం, ఇరుకుగా ఉండడం, ఎవరైనా చుట్టాలు వస్తే చాలా కష్టంగా ఉండేది. మేము ఇద్దరం అన్నదమ్ములం. అన్నయ్య సాయన్నకు మొదటి విడుతలో డబుల్బెడ్ రూం ఇల్లు కేటాయించారు. ఇప్పుడు నాకు రెండో విడుతలో వచ్చింది. కొత్త ఇంటి కల సాకారమైంది. సీఎం కేసీఆర్, మంత్రి ఐకే రెడ్డికి కృతజ్ఞతలు.
ఇల్లు బాధ తప్పింది..
నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ. ఇద్దరు సదువుకుంటున్రు. పాతింట్ల ఒక రూమే ఉండేది. మంచం ఏస్తే నడరాదు. పొలం చేసుకుందామంటే భూమిలేదు. కౌలుకు తీసుకొని పంటలేసినం. ఇల్లు కట్టుకుందామంటే బాకీలు చేయాలే. అవి చేసినంక కట్టుడు మాతోటి అయితదా? అందుకే ఆ చిన్న ఇంట్లనే ఏండ్ల సంది ఉంటున్నం. ఇప్పుడు ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇల్లు ఇచ్చింది. సంతోషమనిపిస్తుంది. ఇప్పుడు మేం ఏం చేసినా పిల్లల కోసమే చేస్తం. గవర్నమెంట్ గరీబోళ్లను ఆదుకుంటున్నందుకు దండాలు.