నేరడిగొండ, జూన్ 26 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని చేపట్టింది. నేరడిగొండ మండలంలో 77 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 14 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను మన ఊరు- మన బడి కార్యక్రమం కింద ఎంపికయ్యాయి. 11 పాఠశాలల్లో విద్యాకమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను జిల్లా ఉన్నతాధికారులు, ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో ముమ్మరంగా సాగుతున్నాయి. మండలంలోని వడూర్, నేరడిగొండ, కొర్టికల్ మథురతండా, తేజాపూర్, కుమారి, వాంకిడి, బోందిడి ప్రాథమిక పాఠశాలలు, తర్నం, బుగ్గారం(కే), వడూర్ ప్రాథమికోన్నత పాఠశాలలు, తేజాపూర్, వడూర్, వాంకిడి, నేరడిగొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు మొదటి విడుతలో ఎంపికయ్యాయి. ఇందులో నేరడిగొండ, కొర్టికల్ మథురతండా పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి కావచ్చాయి.
మిగతా పాఠశాలల్లో టెండర్లు పూర్తయి ప్రారంభ దశలో ఉన్నాయి. మన ఊరు- మన బడి కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలల్లో ప్రాధాన్యతాంశాలతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాల్సి ఉండగా మొదటి దశలో తాగునీటి సరఫరా, విద్యుత్, తరగతి గదుల మైనర్, మేజర్ మరమ్మతులు, విద్యా కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్నారు. నేరడిగొండ, మథురతండా పాఠశాలల్లో పనులు తుది దశకు చేరుకున్నాయి. అదే విధంగా మిగతా పాఠశాలల్లో కూడా అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 3న ప్రారంభమైన ప్రొఫెసర్ జయశంకర్సార్ బడిబాట కార్యక్రమం 30 వరకు కొనసాగనున్నది. ఈ నెల 13న పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో పాటు జూలై1 నుంచి ప్రత్యక్ష తరగతులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పాఠశాలల అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేందుకు టీఎస్ఈడబ్ల్యూడీసీ ఇంజినీరింగ్ శాఖ అధికారులు కృషి చేస్తున్నారు.
పనుల పరిశీలన
మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను జిల్లా అదనపు కలెక్టర్తో పాట పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు. నేరడిగొండ ప్రాథమిక పాఠశాలతో పాటు వివిధ గ్రామాల్లోని పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
త్వరలోనే పూర్తి చేస్తాం
మన ఊరు-మన బడి పనులను జూన్ చివరి నాటికి పూర్తి చేస్తాం. నేరడిగొండ మండలంలో 14 పాఠశాలలు మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ఎంపికయ్యాయి. తాగునీటి కోసం సంపు నిర్మాణ పనులు, విద్యుత్, మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
-సునీల్, ఏఈ, నేరడిగొండ.
మరమ్మతు పనులు పూర్తయ్యాయి
సంపు నిర్మాణంతో పాటు తరగతి గదుల మరమ్మతులు పూర్తయ్యాయి. విద్యుత్ సరఫరా పనులు చేయాల్సి ఉంది. మరుగుదొడ్లకు నీటి సరఫరా పనులు కూడా మిగిలి ఉన్నాయి. ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు.
-సుధారాణి, వడూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు,
ఇబ్బంది లేకుండా చర్యలు
విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. మన ఊరు- మన బడి కార్యక్రమం కింద ఎంపికైన 14 పాఠశాలలకు గాను 15 స్కూళ్లలో అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ నెల 30 నాటికి పనులు పూర్తవుతాయి.
-అన్రెడ్డి భూమారెడ్డి, ఎంఈవో, నేరడిగొండ