ఆదిలాబాద్ రూరల్, జూలై 21: త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ ( ఈద్-ఉల్-జుహా) పండుగను ముస్లిం సోదరులు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనల కోసం మున్సిపల్ పాలకవర్గ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తుండడంతో ముస్లింలు ఆయా ప్రాంతాల్లోని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలు సుఖంగా జీవించేలా చూడాలని అల్లాను ప్రార్థించారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తమ పూర్వీకుల సమాధుల వద్ద నివాళులర్పించారు. ఖుర్బానీ తమ బంధువులు, స్నేహితులకు పంచిపెట్టారు. జిల్లాలోని ముస్లింలకు ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్చైర్మన్ జహీర్ రంజానీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
బోథ్, జూలై 21: బోథ్, సొనాల, కౌఠ(బీ), ధన్నూర్(బీ) మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బోథ్లోని జామా మసీద్ వద్ద ఎస్ఐ పీ రాజు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
నార్నూర్, జూలై 21: మండలంలో ముస్లింలు బక్రీద్ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈద్గా పెద్దల సమాధుల వద్ద నివాళులర్పించారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు.
సిరికొండ, జూలై 21: మండల కేంద్రంతో పాటు రాంపూర్, పొన్న గ్రామాల్లో ముస్లింలు బక్రీద్ పండుగను నిరాడంబరంగా నిర్వహించారు. ముస్లింలు నూతన వస్ర్తాలు ధరించి అల్లాను ప్రార్థించారు. మసీదు, ఇండ్లల్లో భౌతికదూరం పాటిస్తూ ప్రార్థనలు చేశారు. ఖుర్బానీ ఇచ్చిపుచ్చుకున్నారు. సిరికొండ సర్పంచ్ నర్మద ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇచ్చోడ, జూలై 21: మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం సమీపంలో గల ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈద్గా మైదానం వద్ద సీఐ రవీందర్, శిక్షణ ఎస్ఐ విజయ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులకు ఎంఐఎం నాయకులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
భీంపూర్, జూలై 21: మండలంలోని అర్లి(టీ), గోనా, ధనోరా, అంతర్గాం, నిపాని, పిప్పల్కోటి గ్రామాల్లోని ముస్లింలు మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇమామ్లు సందేశాన్ని వినిపించారు. గోనా గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో సర్పంచ్ బాదర్, జహూర్ అహ్మద్, మతీన్, హుస్సేన్, అఫ్రోజ్ , షేక్ మహ్మద్ రఫీ పాల్గొన్నారు.
ఉట్నూర్, జూలై 21: త్యాగానికి చిహ్నమైన బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు మండల కేంద్రంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వర్షం కురుస్తుండడంతో మత పెద్దలు జామ మసీద్లోనే ప్రార్థనలు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో పాల్గొన్నారు. ఎంపీపీ పంద్ర జైవంత్రావు, మాజీ మండలాధ్యక్షుడు దాసండ్ల ప్రభాకర్ ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు.
ఇంద్రవెల్లి, జూలై 21: మండల కేంద్రంతో పాటు హీరాపూర్, కెస్లాగూడ(ఎం), ముత్నూర్, శంకర్గూడ, ధనోరా(బీ), ఏమాయికుంట గ్రామాల్లో ముస్లింలు ఈద్గాలతో పాటు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇన్చార్జి ఎస్ఐ సురేశ్, పోలీస్ సిబ్బంది, మండలానికి చెందిన ఆయా పార్టీల నాయకులు ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు యుసుబ్బేగ్, యాకుబ్బేగ్, ఎంపీ మసూద్, మహ్మద్ అబ్దుల్ అమ్జద్, షేక్ సుఫియాన్, జావిద్, ఇర్షాద్, సుఫియాన్, అబ్దుల్ రహీం, తదితరులు పాల్గొన్నారు.
నేరడిగొండ, జూలై 21: నేరడిగొండ, వడూర్, వాంకిడి గ్రామాల్లోని ముస్లిం సోదరులకు జడ్పీటీసీ జాదవ్ అనిల్ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎస్ఐ భరత్సుమన్, ట్రైనీ ఎస్ఐ రాకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు శంకర్, భూషణ్, రాములు, సుభాష్, ఉప్పు పోశెట్టి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, జూలై 21: లక్కారం, దంతన్పల్లి, బీర్సాయిపేట, ఎక్స్రోడ్, హస్నాపూర్, శ్యాంపూర్ గ్రామాల్లో ముస్లిం లు నూతన వస్త్రాలు ధరించి మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు సందేశాన్ని ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, నాయకులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.