బోథ్, జూలై 21: బోథ్ మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. మంగళవారం సాయంత్రం మొదలైన వర్షం బుధవారం దినమంతా పడింది. వర్షపాతం 49.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. వర్ష కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బోథ్లోని సాయినగర్ కాలనీలో ఇళ్లలోకి వరద చేరింది. దీంతో వస్తువులు తడిసి ముద్దయ్యాయి. నీరు బయటకు వెళ్లే దారి లేకపోవడంతో కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. సొనాల, కౌఠ (బీ), ధన్నూర్ (బీ), పొచ్చెర, కన్గుట్ట, మర్లపెల్లి, పట్నాపూర్, కుచ్లాపూర్ తదితర గ్రామాల్లో వర్షపు నీరు పంట పొలాల్లో నిలిచి ఉండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పత్తి, సోయా, కంది మొక్కలు నీరుపట్టి ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు గ్రామాల్లోని రోడ్డన్నీ చిత్తడిగా మారాయి.
ఇచ్చోడలో భారీవర్షం..
ఇచ్చోడ జులై 21 : ఇచ్చోడ మండలంలో ముసురు పెట్టిం ది. ఉదయం నుంచి వర్షం కురియడంతో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. దినమంతా ముసురు పెట్టడంతో రైతన్నలు, రైతు కూలీలు ఇంటి వద్దే ఉండి పోయారు. గ్రామాల్లోని రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. సాయంత్రం వేళ జోరుగా వర్షం కురిసింది. పలు గ్రామాల్లోని పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురు, శుక్రవారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మండలంలో కురిసిన భారీ వర్షానికి ముక్రా (కే) వాగు ఉప్పొంగింది. సుమారు రెండున్నర గంటల పాటు వరద ఉధృతికి రాకపోకలు స్తంభించి పోయాయి.
నేరడిగొండలో..
నేరడిగొండ, జూలై 21 : మండలంలో భారీ వర్షం కురిసిం ది. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండ వాన ప డింది. ముసురు పట్టడంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పొంగిపొర్లుతున్న వాగులు
బజార్హత్నూర్, జూలై 21 : బజార్హత్నూర్ మండలంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి కోల్హారి, బజార్హత్నూర్, గిరిజాయి, భూతాయి, తదితర గ్రామాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోవండంతో గంటల తరబడి వాగుల వద్ద పడిగాపులు కాస్తూ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద వచ్చి చేరింది. సోయా, పత్తి పంటల్లో నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
విస్తారంగా వర్షాలు
భీంపూర్, జూలై 21 : మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, చెరువులు , పెన్గంగలో మ రింతగా నీరు వచ్చి చేరుతున్నది. సరిహద్దు గ్రామాలు గుబ్డి, గోముత్రి,కరంజి(టి), వడూర్, గొల్లగఢ్ ప్రాంతాల్లో పెన్గంగ వరదతో నిండుగా ప్రవహిస్తున్నది. కరంజి(టి) తర్వాత గుబ్డి మార్గంలో రెండు వాగులకు వరద కారణంగా అక్కడి గుబ్డి, కొజ్జన్గూడ, టేకిడి రాంపూర్ గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. ఎడతెరిపిలేని వానతో చేలలో పనులకు అం తరాయం ఏర్పడింది. లోతట్టు చేలు జలమయమయ్యాయి. ఆదిలాబాద్ -కరంజి(టి), అందర్బంద్ రూట్లలో ఆర్టీసీ, ఇతత వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
చెరువులు, కుంటలకు జలకళ
సిరికొండ, జూలై 21: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు వరదతో నిండుగా ప్రవహిస్తున్నాయి. సిరికొండ మండల కేంద్రంలో కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎటు చూసినా రోడ్లపై నీరు పారుతూ కనిపించాయి. మండలంలోని వాయిపేట్, రాయిగూడ, సుంకిడి, రాజంపేట్ లచ్చింపూర్, కుంటగూడ తదితర గ్రామాల్లో భారీ వర్షం పడడంతో వాగులు పొంగి ప్రవహించాయి. రాంపూర్ గూడ, లక్కంపూర్, జెండాగూడ, నారాయణపూర్, ధర్మసాగర్, మల్లాపూర్, తుమ్మలపాడు గ్రామాలకు బుధవారం రాకపోకలు నిలిచిపోయాయి. రాంపూర్, తుమ్మలపాడు వాగులపై ప్రభుత్వం వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఏజెన్సీలో..
ఉట్నూర్, జూలై 21 : ఏజెన్సీ పరిధిలోని ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి మండలాల్లో రెండు రోజులు గా ఏకధాటిగా భారీ వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు, వంకలు, చెరువులు కుంటల్లో భారీగా నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డివిజన్లోని పలు మారుమూల గ్రామాల వాగులు భారీగా పారడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం ఎడతెరిపు లేకుండా కురియడంతో మండల అధికారులు అప్రమత్తమయ్యారు.
నిలిచిన వ్యవసాయ పనులు..
ఉట్నూర్ రూరల్, జూలై 21: మండలంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులు నిండుతున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో నీరు వచ్చిందంటే రైతులు వరి నాట్లు వేయడానికి సిద్ధమవుతారు. మండలంలోని లక్కారం గ్రామ పంచాయతీలోని గంగన్నపేట్ చెరువు వరదతో నిండుతున్నది. లక్కారం నేరెల్ల చెరువు, మత్తడి చెరువు పూర్తిగా నిండి మత్తడి ద్వారా నీరు దిగువకు వృథాగా పోతున్నది. ఉట్నూర్లోని గోపాయి, ఎల్ల మ్మ చెరువులకు వరద వస్తున్నది. దంతన్పెల్లి నరసింహ చెరు వు, చెరువుగూడ చెరువు, బిర్సాయిపేట్ పెద్ద చెరువు, భూపేట్ చెరువు నీటితో కళకళలాడుతున్నాయి. మంగళవారం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండడంతో వ్యవసాయ పనులు నిలిచిపోయాయి.
వాగులకు వరద
ఇంద్రవెల్లి, జూలై 21: మండలంలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు వరదతో ఉప్పొంగుతున్నాయి. చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు జలమయమాయ్యాయి. వడగాం, వా ల్గోండ, పాటగూడ, గౌరాపూర్, ముత్నూర్, గిన్నేరా, హర్కాపూర్ వాగులు ఉప్పొంగుతున్నాయి. మండలంలోని అంజీ, జైత్రంతండా, గౌరాపూర్ చిత్తబట్ట గ్రామాల మధ్యనున్న వాగు పై నిర్మించిన చెక్డ్యాంల కట్టలపై నుంచి వరద పారుతుంది. గౌరాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని చిత్తబట్ట గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండలానికి ఆయా పనుల కోసం రాకపోకలు చేయడానికి వెళ్లినవారు వరదలోంచి వచ్చేందుకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తున్నది. వర్షంతో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది.
ఉమ్మడి మండలంలో..
నార్నూర్, జూలై 21: ఉమ్మడి మండలంలో రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. వర్షం ఇలాగే కురిస్తే పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.