బెల్లంపల్లి టౌన్, జూలై 21 : సింగరేణి చరిత్రలో ఎక్కడా లేని విధంగా శాంతిఖని గని.. జూన్లో గణనీయమైన బొగ్గు ఉత్పత్తి సాధించింది. 121 శాతం బొగ్గు ఉత్పత్తితో సత్తా చాటింది. బోల్టర్ మైనర్ యంత్రం ద్వారా ఇంతా బొగ్గు ఉత్పత్తితో రికార్డుకెక్కింది. 350 మీటర్ల లోతు నుంచి అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి చేసిన గనిగా పేరు తెచ్చుకున్నది. మందమర్రి ఏరియాలోనే అత్యధికంగా 121 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించి, రెండో స్ధానం కైవసం చేసుకుంది. మందమర్రి ఏరియాలో జూన్ నెలలో మొత్తం 79 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగింది. కేకే-1 గనిలో 15,375 టన్నులు, కేకే 5 గనిలో 9,412 టన్నులు, ఆర్కే-1 గనిలో 9,306 టన్నులు, కాసిపేట గనిలో 12,084 టన్నులు, కాసిపేట-2 గనిలో 5,310 టన్నులు బొగ్గు వెలికితీయగా, శాంతిఖనిలో 12,107 టన్నుల ఉత్పత్తి జరిగింది.
గతేడాది 20 ఏళ్ల రికార్డు బద్దలు..
యాంత్రీకరణ గనిగా రూపాంతరం చెందిన శాంతిఖని, 20 ఏళ్ల రికార్డును గత ఆర్థిక సంవత్సరం బద్దలు కొట్టింది. అప్పటి వరకు బొగ్గు ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోవడంతో గని భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మెరుగైన రీతిలో ఉత్పత్తి సాధిస్తూ గనికి ఉజ్వల భవిష్యత్ ఉందనే ఆశలు రేకెత్తిస్తున్నది. 2000వ సంవత్సరంలో ఓ నెలలో 15వేల టన్నుల బొగ్గు ఉత్పత్తితో రికార్డు సాధించగా, గతేడాది సెప్టెంబర్లో 15,500 టన్నులు వెలికితీసి ఆ రికార్డును బద్దలు కొట్టింది.
30 ఏళ్లకు సరిపడా బొగ్గు వనరులు..
ఈ గనిలో 30 ఏళ్లకు సరిపడా బొగ్గు వనరులు నిక్షిప్తమై ఉన్నాయి. బెల్లంపల్లి రీజియన్లోనే శాంతిఖని గని అత్యంత పురాతనమైనది. 1954లో ప్రారంభమైంది. అప్పటి నుంచి నిరాటంకంగా బొగ్గు ఉత్పత్తి జరుగుతోన్నది. ఈ క్రమంలో మెగా లాంగ్వాల్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు సింగరేణి యాజమాన్యం ప్రతిపాదనలు చేసింది. ఇందులో భాగంగానే గనిలో యాంత్రీకరణకు పెద్దపీట వేశారు. మూడేళ్ల క్రితం గనిలో వరుసగా మైనర్ (సీఎం), రెండేళ్ల కితం బోల్డర్ మైనర్ యంత్రాలను ప్రవేశపెట్టారు. వీటి ద్వారా 13 మిలియన్ టన్నుల బొగ్గును గరిష్టంగా 20 ఏళ్ల వరకు వెలికితీయాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. ఈ క్రమంలో వరుసగా మైనర్ యంత్రం పనిచేస్తున్న ప్రాంతంలో బొగ్గు ఉత్పతి చేయడం కష్ట సాధ్యమైంది. భౌగోళిక స్థితుల కారణంగా ఈ యంత్రం ద్వారా ఆశాజనకమైన ఉత్పత్తి జరుగకపోవడంతో రెండు నెలల క్రితం గని నుంచి బయటకు తీసుకువచ్చి, ఇతర చోటికి తరలించారు.
బోల్డర్ మైనర్ పైనే ఆశలు..
ఈ గనిలో బొగ్గు ఉత్పత్తికి యాజమాన్యం బోల్డర్ మైనర్ యంత్రంపైనే ఆశలు పెట్టుకున్నది. రెండు సార్లు గత బొగ్గు ఉత్పత్తి రికార్డును బద్దలు కొట్టడంతో యాజమాన్యం పూర్తిగా ఈ యంత్రంపై దృష్టిపెట్టింది. ఈ యంత్రం ప్రతి నెలలో సగటున 274 మీటర్ల బొగ్గును కటింగ్ చేయాలన్న లక్ష్యం నిర్దేశించుకున్నారు. కాగా, జూన్లో 352 మీటర్ల బొగ్గును కటింగ్ చేసి, రికార్డుకెక్కింది. ఈ యంత్రం ద్వారా సింగరేణిలో ఎక్కడ కూడా ఇంత బొగ్గును ఉత్పత్తి చేయకపోవడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ యంత్రం ద్వారా రోజుకు 100 టన్నుల నుంచి 600 టన్నులు సాధించే దిశగా బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఈ యంత్రం ద్వారానే బొగ్గు ఉత్పత్తి పెరిగి 20 ఏళ్ల రికార్డును కూడా అదిగమించారు. బొగ్గు ఉత్పత్తి క్రమక్రమంగా పెరుగుతుండడంతో శాంతిఖని భూగర్భ గని ఉజ్వల భవిష్యత్కు బాటలు పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.