దండేపల్లి/హాజీపూర్/బేల, జూలై 20 : దైవ ప్రేమలో తనకు చెందిన ప్రతి దాన్నీ త్యాగం చేసే వాగ్ధానాల పండుగ ఇది. ఇబ్రహీం అలైహిస్సాలాం త్యాగానికి గుర్తుగా ముస్లింలు ఘనంగా జరుపుకుంటారు. ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్హజ్ 10వ తేదీన నిర్వహిస్తారు. కొత్త బట్టలు తొడగడం, ఈద్గా వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేయడం సర్వసాధారణం. పండుగ అంటే కేవలం సంతోషాన్ని వెలిబుచ్చడం, సంబురాలు జరుపుకోవడం కాదు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవడం. దేవుని సమక్షంలో భక్తి ప్రపత్తులతో మోకరిల్లడం లాంటివి ఉంటాయి.
సర్వస్వాన్నీ త్యాగం చేసే పండుగ
ఇది మహానీయ ఇబ్రహీం విధానాల పండుగ. దైవ ప్రేమలో తనకు చెందిన ప్రతిదాన్నీ త్యాగం చేసే వాగ్ధానాల పండుగ. మహానీయ ఇబ్రహీం ఆయన సహచరులైన ముస్లింలతో నేటి ముస్లింలకు, దేవుని విధేయులకు మహోత్కృషమైన ఆదర్శముందన్న ఖురాన్ పిలుపే బక్రీద్ పండుగ. ఆ పిలుపునకు స్పందనగా లబ్బైక్ అల్లాహుమ్మా……లబ్బైక్ అల్లాహుమ్మా…..లబ్బైక్….వస్తున్నాను అని చాటుతూ పరుగిడిపోయే హజ్కాలంలో వచ్చే పండుగ ఇది. హజ్ తీర్థయాత్రలకు వెళ్లిన వారు మక్కా నుంచి మదీనాను సందర్శిస్తారు. అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్ను బలి ఇవ్వడానికి సిద్ధమవుతారు. ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటారు.
ఖుర్భానీ సమర్పించుకోవడం పండుగలో అంతర్భాగం
రంజాన్లాగే బక్రీద్ పండుగను కూడా ఖుద్భా(ధార్మిక ప్రసంగం)తో ఈద్గాలో సామూహిక ప్రార్థనలు జరుపుతారు. ఆ తర్వాత నెమరువేసే జంతువులు (ఒంటే, మేక, గొర్రె ) మాత్రమే ఖుర్భానీ(బలీ) ఇస్తారు. బలి ఇచ్చిన తర్వాత దానిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగం తమ కోసం ఉంచుకుంటారు.
ఖుర్బానీ తప్పనిసరి..
ఎవరి వద్దయితే యాభైరెండున్నర తులాల వెండి, ఏడున్నర తులాల బంగారం లేదా ఆ మేరకు డబ్బు ఉంటుందో.. ఖుర్బానీ తప్పనిసరి అవుతుంది. ఖుర్బానీ అంటే త్యాగం చేయడం.ఇబ్రహీం అలైహీవసలాం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు ఖుర్బానీ ఇస్తారు. మేక, గొర్రె, ఖుర్బానీ ఇచ్చే వ్యక్తి ఒకరి పేరిట ఒక జంతువును ఖుర్బానీ ఇవ్వాలి. మూడురోజుల్లోపు వీలును బట్టి ఖుర్బానీ ఎప్పుడైనా ఇవ్వచ్చు.
పండుగకు సర్వం సిద్దం
బుధవారం జరుపుకునే బక్రీద్ పండుగకు ఉమ్మడి జిల్లాలోని ఈద్గాలన్నీ ముస్తాబయ్యాయి. ఖుర్బానీ(బలీ)ఇవ్వడం కోసం మేకలు, గొర్లను ఇప్పటికే కొనుగోలు చేశారు. పండుగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అధికారులు పిలుపు నిస్తున్నారు. కరోనా కొంతమేర తగ్గడంతో ముస్లింలు ఈద్గా, మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఇస్లాం ధర్మ శాస్త్రం ప్రకారం ముస్లింలకు ముఖ్యమైన పండుగల్లో రెండోది ‘ఈద్ – ఉల్ – జుహా (బక్రీద్). బక్రీద్ లేదా ఈదదుల్ – ఖుర్బానీ అని పిలుస్తారు. ఇస్లాం చరిత్రలో ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. సుమారు 4 వేల ఏళ్ల క్రితం ముస్లిం యుగ పురుషుడు ఖలీల్ – ఉల్లాహా (దేవుని స్నేహితుడు) హజ్రత్ ఇబ్రహీం అలైహి సలాం దైవ ప్రశంశ పొందాడు. కట్టుకున్న ఇల్లాలిని, కన్న కొడుకును కూడా దైవ విశ్వాసం కోసం త్యాగం చేయాలనుకున్న హజ్రత్ ఇబ్రహీం భక్తి తాత్సారతను ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఈ రోజు స్మరించుకుంటారు. బ్రహీం చేసిన నిరుపమాన త్యాగానికి ప్రతీకగా ముస్లింలు ఈ పర్వదినాన్ని ఘనంగా నిరహించుకుంటారు. ఇస్లాం మాసం జిల్ హజ్ 22వ తేదీన ఈ పండుగను జరుపుకుంటారు. ఇదే రోజు మక్కా యాత్రకు వెళ్లిన ముస్లింలు అల్లాహ్ ఇళ్లు అయిన కాబాతుల్లా(మక్కా) వద్ద ప్రదక్షిణలు చేస్తారు.