బోథ్, జూలై 20: తొలి ఏకాదశి పర్వదినాన్ని మంగళవారం మండలంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కుచులాపూర్ క్రాస్రోడ్డులోని వేంకటేశ్వర స్వామి, బోథ్లోని సాయిబాబా, విఠలేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సొనాల, కౌఠ(బీ), ధన్నూర్(బీ), పొచ్చెర, కన్గుట్ట, మర్లపల్లి గ్రామాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేంకటేశ్వర స్వామి ఆలయంలో వేదపండితులు సదానందశర్మ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. భక్తులు ఉపవాస దీక్షలు ఆచరించారు.
గుడిహత్నూర్, జూలై 20: మండల కేంద్రంలోని శివాలయం భక్తులతో సందడి నెలకొంది. కరోనా నేపథ్యంలో పండరీపురం పుణ్య క్షేత్రానికి వెళ్లకపోవడంతో లింగాపూర్ నుంచి మండల కేంద్రంలోని విఠలేశ్వర స్వామి మందిరం వరకు భజనలు చేస్తూ భక్తులు వచ్చారు. స్వామికి అభిషేకం చేశారు. భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
భీంపూర్, జూలై 20 : మండలంలో తొలి ఏకాదశి పండుగను ఘనంగా నిర్వహించారు. కరంజి(టీ), అంతర్గాంలోని రామాలయాలు, అర్లి(టీ), నిపాని, పిప్పల్కోటి, ధనోరా వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. గుబ్డి శివారులోని సూర్యగుట్టపై నెలకొన్న సూర్యనారాయణుడికి పూజలు చేశారు.
సిరికొండ, జూలై 20: మండలంలో తొలి ఏకాదశి పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మండల కేంద్రంలోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. రాంపూర్, కొండాపూర్, రాయిగూడ, పొన్న, రిమ్మ గ్రామాల్లోని భక్తులు ఉపవాస దీక్షలతో భగవంతుడిని పూజించారు.