ఆదిలాబాద్, మే 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ రిమ్స్ దవాఖాన ఉమ్మడి జిల్లావాసులతోపాటు మహారాష్ట్రవాసులకు కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దులో మహారాష్ట్ర ఉండటం, అక్కడి ప్రజలు వివిధ వ్యాధులకు చికిత్స కోసం రిమ్స్కు వస్తారు. ప్రస్తుతం కష్టకాలంలో కూడా ఆదిలాబాద్ రిమ్స్లో మహారాష్ట్రలోని నాందేడ్, యావత్మల్, చంద్రాపూర్ జిల్లాలకు చెందిన ప్రజలకు కరోనాతోపాటు గైనిక్, ఇతర వైద్య సేవలు అందిస్తున్నారు. 50 రోజుల్లో 94 మంది గర్భిణులకు ప్రసవాలు చేయగా.. 21 మంది కొవిడ్ బాధితులకు చికిత్సలు అందించారు. తమ రాష్ట్రంలో అందని వైద్య సేవలు తెలంగాణలో అందుతుండడంపై మహారాష్ట్రవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దులో మహారాష్ట్రకు చెందిన నాందేడ్, యావత్మాల్, చంద్రాపూర్ జిల్లాలు ఉంటా యి. ఈ జిల్లాకు చెందిన వారితో ఆదిలాబాద్ జిల్లావాసులకు బంధుత్వాలు, వ్యాపార సంబంధాలు, వ్యవసాయ పనులకు సంబంధించిన కార్యకలాపాలు ఉంటాయి. దీంతో ఇరు రాష్ర్టాల మధ్య రైలు, రోడ్డు మార్గాల ద్వారా రాకపోకలు సాగుతాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రిమ్స్లో వైద్యసేవలు కోసం మహారాష్ట్ర మూడు జిల్లాలకు చెందిన ప్రజలు తరలివస్తారు. రిమ్స్లో లాక్డౌన్ కంటే ముందు రోజు 1,500-1700 వరకు ఓపీ ఉంటుండగా.. ఇందులో 10 శాతం మహారాష్ట్రకు చెందిన వారు ఉండేవారు. పక్కరాష్ట్రం నుంచి వైద్య సేవల కోసం వచ్చిన వారిని రిమ్స్ వైద్యులు అవసరమైన పరీక్షలు నిర్వహించి చికిత్సల కోసం ఇన్పేషెంట్లు(ఐపీ)గా చేర్చుకుంటారు. రోజు మహారాష్ట్రకు చెందిన వారి ఐపీ 5 శాతం ఉంటుందని వైద్యులు తెలిపారు. రిమ్స్లో వివిధ వ్యాధులకు మెరుగైన వైద్య సేవల అందుతుండడంతో వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.
కష్టకాలంలో మెరుగైన వైద్యం