ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాధించిన విద్యార్థుల సంఖ్య
మొత్తంగా 39274 మంది ఉత్తీర్ణత
ఎఫ్ఏ-1 ఆధారంగానే గ్రేడ్లు
ఫలితాల్లో బాలికలదే పైచేయి
కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతా ప్రమోట్
పదోతరగతి ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలను రద్దుచేసి ఇప్పటికే అందరినీ ప్రమోట్ చేయగా, వారికి సంబంధించిన గ్రేడ్లను తాజాగా అధికారులు విడుదల చేశారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)-1 ఆధారంగానే గ్రేడ్లు కేటాయించినట్లు ప్రకటించారు. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా 911 ఉన్నత పాఠశాలలు ఉండగా, మొత్తంగా 39274 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 11183 మంది 10 జీపీఏ సాధించగా, ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు.
-ఆదిలాబాద్ రూరల్/నిర్మల్ అర్బన్, మే 21
మంచిర్యాల, మే 21 మే 21(నమస్తే తెలంగాణ): పదో తరగతి ఫలితాలను శుక్రవారం విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. మంచిర్యాల జిల్లాలో 247 జడ్పీ, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్తో పాటు మొత్తం పాఠశాలల్లోని 11,131 మంది విద్యార్థులకు గాను 11,130 మంది ఉత్తీర్ణులయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.వెంకటేశ్వర్లు ప్రకటించారు. కాసిపేట మండలానికి చెందిన ఒక విద్యార్థి మృతి చెందాడని ఆయన పేర్కొన్నారు. ఉత్తీర్ణులయిన వారిలో 3,825 మంది 10 జీపీఏ సాధించారని ఆయన తెలిపారు. పదో తరగతి విద్యార్థులందరికీ ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)-1 ఆధారంగానే గ్రేడ్లు కేటాయించనున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం గ్రేడ్లు విడుదల చేసింది.
247 పాఠశాలలు..
11,130 మంది ఉత్తీర్ణులు..
జిల్లాలో 247 పాఠశాలల్లో 11,130 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో 275 మంది విద్యార్థులుండగా, 36 మంది 10 జీపీఏ సాధించారు. 100 జడ్పీ పాఠశాలలుండగా, 4187 మంది విద్యార్థులున్నారు. వీరిలో ఒకరు మృతి చెందగా, 4,186 మంది పాస్ అయ్యారు. 99 పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించగా, 946 మంది 10 జీపీఏ పొందారు. ఏడు ఎయిడెడ్ పాఠశాలల్లో 448 మంది విద్యార్థులుండగా 172 మంది, 18 కేజీబీవీ పాఠశాలల్లో 711 మందికి 201 మంది, ఐదు మోడల్ స్కూళ్లలో 491 మంది విద్యార్థులకు గాను 222 మంది, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ నాలుగు పాఠశాలల్లో 289 మందికి 202, టీఎస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ 10 స్కూళ్లలో 563 మంది విద్యార్థులకు గాను 178 మంది పది జీపీఏ సాధించారు. రెండు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 161 మంది విద్యార్థులుండగా 88, ఒక తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ పాఠశాలలో 75 మందికి ఏడుగురు 10 జీపీఏ పొందారు. 14 ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో (జీఏహెచ్ఎస్) 600 మందికి గాను 98 మంది, 79 ప్రైవేటు పాఠశాలల్లో 3341 మంది విద్యార్థులుండగా 1,675 మంది జీపీఏ సాధించినట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా, జిల్లాలో 247కు గాను 246 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. మొత్తం 11,131 మంది విద్యార్థులకు గాను 3,825 మంది 10 జీపీఏ సాధించారు. 761 మంది విద్యార్థులు 9.5 జీపీఏ, 703 మంది 9.7 జీపీఏ,724 మంది 9.8 జీపీఏ పొందారు.
కరోనాతో రెండోసారి..
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లుగా, ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)-1 మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ముమ్మర కసరత్తు చేసి గ్రేడ్లు విడుదల చేసింది. ఆయా విషయాల్లో ఎఫ్ఏ-1 మార్కుల ఆధారంగానే గ్రేడ్లు కేటాయించగా, 20 మార్కులనే 100కు లెక్కించారు. ఎఫ్ఏ-1లో 0-6 మార్కులు పొందితే 100 మార్కులకు 0-34గా నిర్ణయించి డీ2 గ్రేడ్గా కేటాయించారు. ఈ విధంగా ఎఫ్ఏ-1లో వచ్చిన మార్కులను 100కు లెక్కించి, గ్రేడ్లను నిర్ణయించారు. ఎఫ్ఏ-1లో 7 మార్కులు వస్తే 35-40, 8-9 మార్కులు వస్తే 41-50గా గుర్తించి డీ1, సీ2 గ్రేడ్లుగా పరిగణించారు. ఎఫ్ఏ-1లో 18-20 మార్కులు వస్తే 91-100గా కేటాయించి ఏ1 గ్రేడ్గా లెక్కించారని డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా, కరోనా సంక్షోభంతో గతేడాది కూడా ఎస్సెస్సీ పరీక్షలు రద్దయ్యాయి. అప్పుడు పరీక్షలు కొనసాగుతుండగానే లాక్డౌన్ ప్రకటించడంతో వాయిదా వేశారు. మళ్లీ పరీక్షల ఏర్పాట్లకు సన్నాహాలు చేసినా, హైకోర్టు ఆదేశాలతో పూర్తిగా రద్దు చేశారు. ఈ యేడాది కూడా పరీక్షలు రద్దు చేయడం, పైతరగతులకు ప్రమోట్ చేయడంతో ఇది రెండోసారి అయ్యింది.
ఆదిలాబాద్ జిల్లాలో
ఆదిలాబాద్ రూరల్, మే 21: జిల్లాలోని 266 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులు 11270 మంది పరీక్ష ఫీజు చెల్లించారు. ఇందులో 5600 మంది బాలురు, 5670మంది బాలికలు ఉన్నారు. ఎఫ్ఏ 1 మార్కుల ఆధారంగా వీరందరూ ఉత్తీర్ణులయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. 10 జీపీఏ సాధించిన వారిలో బాలురు 1209మంది ఉండగా, బాలికలు 1939మంది సాధించారు. ఇందులో 1270 మంది ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులున్నారు.
పాఠశాలల వారీగా 10 జీపీఏ ..
జిల్లాలో ఆశ్రమ పాఠశాలల నుంచి 2185 మంది ఫీజు చెల్లించగా 182మంది, బీసీ డబ్ల్యూ పాఠశాల నుంచి 232 మందికి గానూ 107మంది, ప్రభుత్వ పాఠశాలల నుంచి 721కి 96మంది, కేజీబీవీల నుంచి 580కి 197మంది, జడ్పీ పాఠశాలల నుంచి 3593కి 875 మంది, ప్రైవేట్ పాఠశాలల నుంచి 2550కి 1270 మంది, మైనారిటీ హైస్కూళ్ల నుంచి 262కి 102మంది, మోడల్ పాఠశాలల నుంచి 569కి 136 మందికి, సోషల్ వెల్ఫేర్ పాఠశాలల నుంచి 157కి 51మందికి, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల నుంచి 79కి గాను 25 మందికి, టీఎస్టీడబ్ల్యూఆర్ఎస్ నుంచి 233కి 66 మందికి, టీఎస్డబ్ల్యూఆర్ఎస్ నుంచి 40కి 14 మంది, టీటీడబ్ల్యూఆర్జేసీ నుంచి 69కి 26మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ అర్బన్, మే 21 : నిర్మల్ జిల్లాలో ఉన్న 233 ఉన్నత పాఠశాలలో ఉన్న 9784 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్ష ఫీజును చెల్లించారు. ఇందులో 4784 మంది బాలురు, 5000 మంది బాలికలు ఉన్నారు. ఎఫ్ ఏ1 మార్కుల ఆధారంగా వీరందరూ ఉత్తీర్ణులయ్యారని డీఈవో ప్రణీత తెలిపారు. ఇందులో 2791 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించగా, ఇందులో 1317 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులున్నారు. 1694 మంది బాలికలు ఉన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు త్వరలో మెమోలు అందజేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. పట్టణంలోని శాంతినగర్ గురుకుల పాఠశాలకు చెందిన 77 మంది విద్యార్థుల్లో అందరూ ఉత్తీర్ణులవగా 73 మందికి 10 జీపీఏ సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ నీరడి గంగా శంకర్ తెలిపారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో.
ఆసిఫాబాద్,మే 21: పదో తరగతి ఫలితాల వివరాలను కుమ్రం భీం ఆసిఫాబాద్ డీఈవో ఉదయ్బాబు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 165 ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలల్లో 7265 మంది విద్యార్థులు పదో తరగతి చదివారు. ఇందులో 7090 మంది విద్యార్థుల వివరాలను ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో నమోదు చేయడంతో వారి ఫలితాలను విడుదల చేశారు. బాలికలు 3743 , బాలురు 3347 మంది ఉత్తీర్ణత సాధించారు. పదోతరగతి ఫలితాల్లో బాలుర కంటే బాలికలదే పై చేయి సాధించారు. గ్రేడ్ల వారీగానూ వారే టాప్లో నిలిచారు. బాలికలు 796 మంది, బాలురు 623 మంది పది జీపీఏ సాధించారు.