కేంద్రం కనీస మద్దతు ధరలు కల్పించాలి
సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి
ఖానాపూర్లో రైతు గర్జన మహాసభ
ఖానాపూర్ టౌన్, మార్చి 19 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య అధ్యక్షతన ఖానాపూర్ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన రైతు పోరు గర్జన మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పట్టణంలోని ఏఎంకే ఫంక్షన్ హాల్ నుంచి అఖిలపక్ష నాయకులు, రైతులు పాదయాత్రగా తరలివచ్చారు. ఈ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులను కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందీగా చేస్తున్నదని, ఈ చట్టాలు రైతుల పాలిట శాపంగా మారాయన్నారు. 2006లో బీహార్ రాష్ట్రంలో ఇలాంటి చట్టాల ద్వారానే అక్కడి రైతులు కూలీలుగా మారారని, ఇప్పుడివే దేశ వ్యాప్తంగా అమలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. రైతులు పండించిన పంటలకు వారే మద్దతు ధర నిర్ణయించేలా చట్టం తేవాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికుల పొట్టగొట్టేలా 2003 కోప్టా చట్టంలో చేసిన సవరణలను రద్దు చేయాలన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించి మధ్య తరగతి కుటుంబాలను అదుకోవాలని కోరారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి రాష్ట్రంలోని రైతు సంఘాలు మద్దతుగా ఉంటాయని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఈ సభలో ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య, సీపీఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చుల రంగయ్య, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కే రాజన్న, రైతు సంఘం నాయకులు కే రాజు, రాం లక్ష్మణ్, బక్కన్న, కే లక్ష్మి, ఎం హరిత, అంకుశ్రావు, ముస్కే శంకర్, రాజన్న, ఎల్లయ్య, గంగన్న, మైనార్టీ జేఏసీ నాయకుడు షబ్బీర్పాషా, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు వినోద్, మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు.