ఆదిలాబాద్, మార్చి 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కరోనా నివారణ టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతున్నది. మొదట ఫ్రంట్లైన్ వారియర్స్కు పంపిణీ చేయగా.. ఈనెల 1 నుంచి 60 ఏండ్లు దాటిన వారికి, 45 ఏండ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా వేస్తున్నారు. వ్యాక్సిన్ ప్రారంభంలో ప్రజలు కొంత ఆందోళన చెందిన మాట వాస్తవమే. తదానంతరం టీకా తీసుకున్న వా రికి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకపోవడంతో వ్యాక్సినేషన్కు విశేష స్పందన లభిస్తున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజూ 2,000 నుంచి 2,500 మందికి వైద్యశాఖ అధికారులు టీకా వేస్తున్నారు. వయసు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, బీపీ, షుగర్, ఇతర వ్యాధులు ఉన్న వారు కూడా టీకా తీసుకోవడానికి ఉత్సాహంగా వస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 41,595 మందికి వైద్యశాఖ అధికారులు టీకా వేయగా.. ఆదిలాబాద్ జిల్లాలో 12,649 మంది, మంచిర్యాలలో 12,5 86, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 4,652, నిర్మల్లో 11,708 మంది తీసుకున్నారు.
ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మొదటి విడుత టీకా పంపిణీ పూర్తయింది. వైద్య, పోలీసు, పారిశుధ్య, అంగన్వాడీ సిబ్బందికి రెండు విడుతలుగా పంపిణీ చేశారు. ఈ నెల 1 నుంచి రెండో విడుత పంపిణీ ప్రారంభం కాగా.. అర్హులైన వారందరూ తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 కేంద్రాల్లో పంపిణీ జరుగుతున్నది. 45 ఏండ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, 60 ఏండ్లు దాటిన వారు cowin.gov.in వివరాలు అందించాలి. ఫోన్లో కూడా నమోదు చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వివరాలు నమోదు చేసుకోవాలి. అనంతరం టీకా ఎప్పుడు, ఎక్కడ వేస్తారనే సమాచారం ఫోన్కు మెస్సేజ్ వస్తుంది. కొన్ని పంపిణీ కేంద్రాల్లో సిబ్బంది అర్హులైన వారి వివరాలు నమోదు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు 7,853 మందికి మొదటి డోస్, 4,733 మందికి రెండో విడుత టీకా పంపిణీ చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొదటి విడుతలో 2,552 మందికి, రెండో వి డుతలో 2,100 మందికి.. ఆదిలాబాద్ జిల్లాలో 12,649 మం దికి వ్యాక్సిన్ వేయగా ఇందులో 8,912 మందికి మొ దటి డోస్, 3,737 మందికి రెండో విడుత.. నిర్మల్ జిల్లాలో మొదటి విడుతలో 7,233 మందికి మొదటి డోస్, 4,475 మందికి రెండో విడుత టీకాను వైద్యశాఖ అధికారులు పంపిణీ చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, ఉట్నూర్, నార్నూర్, బోథ్లలో వ్యాక్సిన్ వేస్తున్నాం. టీకా వేసుకునేందుకు వచ్చిన వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పా ట్లు చేశాం. వ్యాక్సిన్ వేసిన తర్వాత అరగంటకు పైగా వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తారు. జిల్లాలో ఇప్పటి వరకు టీకా తీసుకున్న వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదు. ప్రజలు నిర్భయంగా వచ్చి కరోనా టీకాను తీసుకోవచ్చు.
– నరేందర్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి, ఆదిలాబాద్
కరోనాతో అందరం ఇబ్బందులు పడుతున్నాం. ఏటూ పోలేని పరిస్థితి ఉంది. వైద్యశాఖ ఆధ్వర్యంలో ఇస్తున్న కరోనా వ్యాక్సిన్ నేను తీసుకున్నాను. కరోనా వైరస్ ఒకరి నుం చి మరొకరికి సోకుతుంది. ఈ వ్యా ధి రాకుండా ఉండగానికి అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి.
– శోభ, ఆదిలాబాద్