ఆదిలాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అనుకోని ప్రమాదంలో కాలు కోల్పోయినా, ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నాడు ఆదిలాబాద్కు చెందిన రాజులవారి నారాయణ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సర్వే ల్యాండ్ డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేస్తున్న నారాయణ, 22 ఏళ్ల కింద జరిగిన రైలు ప్రమాదంలో ఎడమకాలు కోల్పోయాడు. అప్పుడు పోలీస్ కానిస్టేబుల్గా పని చేస్తున్న నారాయణ తిరుపతికి వెళ్లివస్తుండగా, ఈ ఘటన జరిగింది. వరంగల్లో రైలు దిగి, ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ పడిపోయాడు. దీంతో గాయపడిన నారాయణ కాలును వైద్యులు తొలగించారు. అనంతరం ప్రభుత్వం ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇచ్చింది. కుటుంబ పోషణ కోసం పని చేయాల్సిన పరిస్థితుల్లో మొక్కవోని ధైర్యంతో ఉద్యోగంలో చేరాడు నారాయణ. మోకాలు వరకు కాలు లేకపోయినా, సైకిల్పై రోజూ కార్యాలయానికి వెళ్లి వస్తున్నాడు. సైకిల్ ఎడమ పైడిల్కు 4 కిలోల వరకు ఇనుపకడ్డీలతో బరువును అమర్చాడు. సైకిల్ ఎక్కగానే కుడికాలుతో పైడిల్ను గట్టిగా తొక్కుతాడు. ఎడమకాలు వద్ద ఉన్న పైడిల్ పైకి వచ్చి బరువుతో కిందికి పోతుంది. తిరిగి కుడికాలుతో తొక్కుకుంటూ ముందుకు పోతాడు. 1992 నుంచి ఇలానే క్రాంతినగ్లోని కార్యాలయానికి వచ్చి వెళ్తున్నాడు. నిత్యం ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణం. 58 ఏళ్ల వయస్సులో తనకు బీపీ, షుగర్, ఇతర వ్యాధులు ఏమి లేవని, ఆఫీస్లో అటెండర్గా అన్ని పనులు చేస్తానని నారాయణ తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా ఇతర కార్యాలయాలకు కూడా వెళ్తుంటాడు. ఆత్మవిశ్యాసంతో ముందుకు సాగితే, ఎంతటి కష్టం వచ్చినా ఎదురీదవచ్చునని నారాయణ నిరూపిస్తున్నాడు.