ఏకకాలంలో ఆరుచోట్ల టాస్క్ఫోర్స్ దాడులు
వివరాలు వెల్లడించిన సీపీ సత్యనారాయణ
గర్మిళ్ల, జూన్ 12: మంచిర్యాల జిల్లాలో నకిలీ విత్తనాల మాఫియాపై రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ పూర్తి వివరాలు వెల్లడించారు. టాస్క్ఫోర్స్ సీఐ ఏకే మహేందర్, ఎస్ఐలు లచ్చన్న, శేఖర్ రెడ్డి, పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ టీం 7 బృందాలుగా ఏర్పడి, జిల్లా పరిధిలోని మంచిర్యాల, సీసీసీ నస్పూర్, నెన్నెల్, తాళ్లగురిజాల, కన్నెపల్లి, భీమిని ప్రాంతాల్లో పక్కా సమాచారం సేకరించి ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఆరు ప్రాంతాల్లో 51 లక్షల రూపాయల విలువైన 21 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకొని 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని తెలిపారు.
అక్రమ రవాణా చేసే మార్గాలు…
కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ర్టాల నుంచి నకిలీ పత్తి విత్తనాలు, నిషేధిత గడ్డి మందు అక్రమ రవాణా చేసే స్మగ్లర్లు తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబా ద్, జిల్లాలకు నిత్యావసర సరుకులను తరలించే లారీ, వ్యాన్ ల్లో రహస్యంగా వీటిని తరలించి, మారుమూల గ్రామాల్లో నిల్వ చేసి రైతులకు రహస్యంగా అమ్ముతున్నారని అన్నారు.
ఎంతటి వారినైనా వదిలేది లేదు..
రైతుల కష్టాన్ని దోచుకుంటూ అక్రమ వ్యాపారం చేస్తున్న అక్రమార్కులు ఎంతటి స్థాయిలో ఉన్న వదిలేది లేదని సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. అక్రమార్కుల వ్యవహారాలపై పూర్తి స్థాయిలో కూపీ లాగుతున్నామని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సహాయం తీసుకుంటూ అందరిపై కేసులు నమోదు చేస్తామన్నారు. అక్రమార్కులపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు వెనకాడేదిలేదని స్పష్టం చేశారు. నకిలీ విత్తనాల సమాచారం సేకరించడం, పట్టుకోవడంలో ప్రావీణ్యం చూపిన టాస్క్ఫోర్స్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి క్యాష్ రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్, పట్టణ సీఐ ముత్తి లింగయ్య, టాస్క్ఫోర్స్ సీఐ ఏకే మహేందర్, ఎస్ఐలు ప్రవీణ్కుమార్, దేవయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
పట్టుబడ్డ వారు..
గుర్రాల మహేందర్ ( హుజూరాబాద్ ),పెద్దమ్మల రాజు ( హుజూరాబాద్ ),బిరుదు బానేశ్ ( బొప్పారం, నెన్నల ),దుర్గం వెంకటేశ్ (తాళ్ల గురిజాల, బెల్లంపల్లి ),దోగ్యల రాజ(తాళ్లగురిజాల, బెల్లంపల్లి ),ఎస్.కే అంజద్ ( పెద్దపేట, భీమిని ),పుట్ట అశోక్ (కన్నెపల్లి, భీమిని ),టకిరే సంతోష్ ( జంగంపల్లి ),కొండగొర్ల రాజన్న ( వెంకటాపూర్ )
పరారీలో ఉన్న నిందితులు..
బచ్చన వెంకట చౌదరి ( కొండపల్లి, విజయవాడ ),శ్రీనివాస రావు ( గుంటూరు ),నారా వనజ (దహేగాం ),మల్లికార్జునరావు ( హైదరాబాద్ )
భీమారంలో రూ. 18 వేల విలువైన పత్తి విత్తనాలు ..
భీమారం : మండలకేంద్రంలోని ఆవుడం క్రాస్ రోడ్డు సమీపంలోని బోయవాడ కు చెందిన పెనుకుల రమేశ్ ఇంట్లో 12 కిలోల నకిలీ పత్తి విత్తనాలను ఎస్ఐ అశోక్ స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 18 వేలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. నిందితుడిని విచారించగా మరొకరి ప్రమేమం ఉందని, అతడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ భూమన్న , ఆసంపల్లి కిరణ్ , హోంగార్డు తిరుపతి రెడ్డి , వ్యవసాయ విస్తరణ అధికారి అరుణ్ కుమార్ ,తదితరులు పాల్గొన్నారు.