కుమ్రం భీం ఆసిఫాబాద్జిల్లాలో తగ్గిన తెల్లబంగారం సాగు
గతేడాదితో పోలిస్తే 25 వేల ఎకరాలు..
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఈయేడు పత్తి సాగు తగ్గి.. కంది సాగు పెరిగినట్లు తెలుస్తోంది. పెరిగిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలతో పత్తి సాగుకు పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో పత్తి సాగు తగ్గినట్లు అధికారులు భావిస్తున్నారు. గతేడాది జిల్లాలో పత్తి సాగు 3 లక్షల, 60 వేల ఎకరాల్లో సాగు కాగా, ఈ ఏడాది 3 లక్షల 35 వేల ఎకరాల్లో పండిస్తుండగా, సుమారు 25 వేల ఎకరాల్లో సాగు తగ్గింది. దీనికి బదులుగా రైతులు కంది సాగువైపు మొగ్గుచూపుతున్నారు. గతేడాది జిల్లాలో 35 వేల ఎకరాల్లో కంది పంట సాగు కాగా, ఈ సంవత్సరం 46,096 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. కంది పంటకు పెట్టుబడులు తక్కువగా అవుతుండడం, గిట్టుబాటు ధరలు కూడా ఉంటుండడంతో రైతులు కంది సాగుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
గతేడాది నియంత్రిత విధానంలో..
గతేడాది జిల్లాలో నియంత్రిత విధానంలో పంటల సాగుకు ఈ ఏడాది వానకాలంలో వరి, కంది, పత్తి పంటలవైపు అధికంగా మొగ్గుచూపారు. గతేడాది వరి 60, 323 వేల ఎకరాలు, కంది పంట 35 వేల ఎకరాలు, పత్తి 3, లక్షల 60 వేల ఎకరాలు, జొన్న 5,736 ఎకరాలు, పెసర 5,500 ఎకరాలు, మినుము లు 1,739 ఎకరాలు, వేరుశనగ 60 ఎకరాలు, కూరగాయలు 4,500 ఎకరాలు, మిగితా పంటలు సాగు చేశారు. ఈ యే డాది రైతులు తమకు నచ్చిన పంటలు వేసుకోవాలని ప్రభు త్వం ప్రకటించింది. జిల్లాలో ఈ వానకాలం పత్తి పంట 3 లక్ష ల 35 వేల ఎకరాలు సాగు కానున్నట్లు వ్యవసాయ అధికారు లు అంచనా వేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా సాగయ్యే వరి పంట ఈ వర్షాకాలంలో 54,600 ఎకరాల్లో సాగు కానుంది. కంది 46,0 96 ఎకరాలు, పెసర 3, 017 ఎకరాలు, జొన్న 29,0 62 ఎకరాలు, సోయా పంట 1,564 ఎకరాల్లో సాగు కానుంది. మిగితా ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది జొన్న పంట సాగు విస్తీర్ణం కూడా బాగా పెరిగింది.
వెసులుబాటు..
గతేడాది నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది తమకు నచ్చిన పంటలు వేసుకునే వెసులుబాటు కల్పించడంతో రైతులు నచ్చిన పంటలను వేసుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో సాగుయ్యే పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. పత్తికి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల ఎక్కువగా వినియోగించాల్సి రావడంతోపాటు, సస్యరక్షణ చర్యలు చేపట్టటం ఇబ్బంది కరంగా మారుతోంది. దీనికి తోడు పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు వస్తుండడం, కూలీల కొరత ఎక్కువగా ఉండడంతో రైతులు ఇతర పంటల వైపు ఆసక్తి చూపుతున్నారు. దానికి ప్రత్యామ్నయంగా కంది పంటను సాగుచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో గతేడాదితో పోలిస్తే ఈ యేడు జిల్లాలో 11,600 ఎకరాల్లో కంది పంట అధికంగా సాగవుతోంది. దీనికి పెట్టుబడులు తగ్గుతుండడం, సస్యరక్షణ చర్యలు పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేకుండానే సాగు చేసే అవకాశం ఉండడంతో పాటు పంటను పూర్తిగా ఒకే సారి ఇంటి తీసుకుచ్చే అవకాశం ఉంటోంది. ప్రభుత్వం కంది పంటలకు మంచి గిట్టుబాటు ధరలు కల్పిస్తోంది. దీంతో రైతులు కంది పంటను అధికంగా సాగుచేస్తున్నట్లు తెలుస్తోంది.