ఆదిలాబాద్, మే 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొవిడ్పై సర్కారు యుద్ధం ప్రకటించింది. అంతం చేయడానికి ద్విముఖ వ్యూహం అనుసరిస్తున్నది. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తూనే..అంకుర దశలోనే అంతం చేయడానికి ఇంటింటా జ్వర సర్వే నిర్వహిస్తున్నది. ఆరురోజులుగా ప్రత్యేక బృందాలు ఇల్లిల్లూ తిరుగుతూ ప్రతి కుటుంబ సభ్యుడి ఆరోగ్య వివరాలు నమోదు చేస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ ద్వారా పరీక్షిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం మాములుగా ఉంటే ఇంటివద్దే మందుల కిట్లు ఇస్తున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే కొవిడ్ సెంటర్కు తరలిస్తున్నారు. ఫలితంగా వ్యాధి ముదరక ముందే మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందనేది సర్కారు ఉద్దేశం. బృందాలు ప్రాణాలకు తెగించి సర్వే చేస్తుండగా.. ప్రజల్లో మనోైస్థెర్యం పెరుగుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సర్వే చివరి దశకు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఇంటికొచ్చి మందులిచ్చిన్రు..
కరోనా రోగం వస్తున్నందున మొన్న మా ఊరికి పెద్దడాక్టర్లు వచ్చిన్రు. మీ ఇంట్లో ఎంత మంది ఉన్నరు? ఏమైనా దగ్గు, పడిసం, జ్వరం ఉన్నాయా అని అడిగిండ్రు. మా పిల్లగానికి సర్ది ఉంటే గోలీలు ఇచ్చి, పొద్దూమాపు ఏసుకోవాలని చెప్పిన్రు. ఇంకా చప్పరిచ్చే గోలీలు కూడా ఇచ్చిన్రు. ఈ గోలీలతోని తగ్గకుంటే సర్కారు దవాఖానకు పోయి పెద్ద డాక్టరు సారుకు చూపెట్టాలని చెప్పిన్రు. అంతే కాకుండా బయటకు పోతే మాస్కు పెట్టుకోవాలని, ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కడుక్కుంటూ జాగ్రతగా ఉండాలని చెప్పిన్రు. గిప్పుడు మా పిల్లగాడికి సర్ది తగ్గింది. గిట్లా సర్కారు కరోనా గురించి ముందు జాగ్రత్త పనులు చేపడుతుంటే సంతోషంగా ఉన్నది.
భరోసా కల్పించారు
ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు మా ఆరోగ్య పరిస్థితిపై పరీక్షించారు. జ్వరం, జలుబు, దగ్గు వంటివి ఉన్నాయా? అని అడిగి తెలుసుకుంటున్నారు. ఆక్సీమీటర్తో పరీక్షించారు. వివరాలు సేకరించడంతోపాటు ఉచితంగా మందులు ఇస్తున్నారు. స్వల్పంగా జ్వరం, ఒళ్లు నొప్పులు ఉండడంతో పారాసిటమాల్ మందులు ఇస్తున్నారు. మందులను ఇంటికే తీసుకొచ్చి ఇవ్వడంతోపాటు, బాధితులకు భరోసా కల్పించడం సంతోషంగా ఉంది.
ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నాం..
నా పేరు దాసరి రాధ. నేను చెన్నూర్ పీహెచ్సీలో ఆశ కార్యకర్తగా చేస్తున్నా. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లు ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే చేస్తున్నా. కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? జ్వరం, జలుబు, దగ్గుతోపాటు ఒళ్లు నొప్పులు ఉన్నాయా? తెలుసుకుంటున్నాం. మామూలు లక్షణాలు ఉన్నవారికి పారసిటమాల్, అజిత్రోమైసిన్తోపాటు గవర్నమెంట్ ఇచ్చిన మందులు ఇస్తున్నాం. లక్షణాలు తీవ్రంగా ఉంటే వివరాలు నమోదు చేసుకుంటున్నాం. హోమ్ ఐసొలేషన్ మెడికల్ కిట్లు ఇచ్చి వాడాలని సూచిస్తున్నాం. ఫోన్లో కూడా ఆరోగ్య పరిస్థితిపై తెలుసుకుంటున్నాం. అందరూ దవాఖానకు వచ్చి ఇబ్బంది పడే కంటే హోమ్ ఐసొలేషన్ ఉండడం మంచిదని సూచిస్తున్నాం.
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలోనూ ధైర్యంగా విధులు నిర్వహిస్తున్నాం. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గ్రామంలోని అన్ని వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నాం. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం. బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నాం. సోడియం హైపో క్లోరైట్ ద్రావణం ఎప్పటికప్పుడు పిచికారీ చేస్తున్నాం. వైరస్ నియంత్రణకు కృషి చేస్తున్నాం. ప్రజలందరూ బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అధికారులు సూచించినట్లు ప్రజలకు నాణ్యమైన సేవలందిస్తున్నాం.
సర్వే చేస్తూ మందులు ఇచ్చాం..
కరంజి(టి), కరణ్ వాడి గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, కార్యదర్శితో కలిసి పక్కాగా ఇంటింటి సర్వే చేశాం. కరణ్వాడి గిరిజన గ్రామంలో ఇద్దరికి మాత్ర మే స్వల్ప లక్షణాలు తేలగా వారికి మెడికల్ కిట్లు ఇచ్చాం. తరువాత వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు వారికి కూడా జ్వరం, జలుబు తగ్గింది. ఎవరూ దవాఖానలకు పోవాల్సిన అవసరం లేదు. – సుజాత, ఏఎన్ఎం, కరంజి(టి) ఆరోగ్య ఉప కేంద్రం, భీంపూర్ మండలం
రోగులకు ఇంటివద్దే మందులు
ఇంటింటికీ సర్వే నిర్వహించాం. అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రతి ఇంటికీ తిరిగి మూడు రోజుల్లో పూర్తి చేశాం. ఈ సర్వేలో 16 మందికి జ్వర లక్షణాలు ఉండ గా.. తక్షణమే వారికి వైద్య పరీ క్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశాం. జ్వరాలతో ఉన్న వారి ఫోన్ నంబర్లు తీసుకుని రోజూ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటు న్నం. ఇంటివద్దే మెడికల్ కిట్లను కూడా అందించాం.