ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటున్న వైద్యులు
కరోనా లక్షణాలు ఉంటే మందుల కిట్ల పంపిణీ
ఆదిలాబాద్, మే 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నియంత్రణకు సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ట్రేసింగ్, టెస్ట్, టీకా, ట్రీట్మెంట్ వంటి నాలుగంచెల ద్వారా కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నది. ఇంకొంచెం ముందుకెళ్లి నాలుగు రోజులుగా ఇంటింటా జ్వర సర్వే నిర్వహిస్తున్నది. ప్రతి ఇంటికీ ఏఎన్ఎం, ఆశ వర్కర్, పంచాయతీ, రెవెన్యూ, అంగన్వాడీ కార్యకర్తలు, ఐకేపీ, మెప్మా సిబ్బంది వెళ్తున్నారు. దీనికి తోడుగా జిల్లా, కమ్యూనిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ప్రజలకు కొవిడ్ ఓపీ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో 22 పీహెచ్సీలు, ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాలు.. నిర్మల్ జిల్లాలో 25 పీహెచ్సీలు, మూడు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా దవాఖానకు వచ్చి చికిత్స తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. దవాఖానాలకు వచ్చిన వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి? కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారా? అనే విషయాలు తెలుసుకుంటున్నారు. దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, ఇతర లక్షణాలు ఉన్న వారికి కరోనా కిట్లు ఇస్తున్నారు. ఇంకా వ్యాధి నిర్ధారణలో భాగంగా రక్త పరీక్షలు, స్కానింగ్, ఇతర పరీక్షలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి పీహెచ్సీకి దాదాపు 40-50 మంది వరకు వస్తున్నారు. రోజు అన్ని పీహెచ్సీల్లో కలిపి 800-1100 మంది చూపించుకుంటున్నారు. ఈ నాలుగు రోజుల్లో 3,500-4,400 మందికిపైగా పరీక్షించి మందులు ఇచ్చారు. అలాగే, నిర్మల్ జిల్లాలో రోజూ 10-15 మంది రోగులు వస్తున్నారు. అన్ని పీహెచ్సీల్లో కలిపి 250-400 మంది పరీక్షించుకుంటున్నారు. ఈ నాలుగు రోజుల్లో దాదాపు 1500 మందికి పైగా పరీక్షలు చేయించుకున్నారు.