నిర్మల్ ఏఎస్పీ కిరణ్ ప్రభాకర్
భైంసాలో ఉదయం నుంచే గల్లీల్లో సోదాలు
భైంసా, ఏప్రిల్ 7 : అసాంఘిక శక్తులపై నిఘా కొనసాగించడానికే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు ఏఎస్పీ కారే కిరణ్ ప్రభాకర్ తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కుంటగల్లీలో బుధవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం నుంచి పోలీసు బలగాలు ఈ కాలనీల్లో మోహరించాయి. ఇంటింటికీ వెళ్లి సోదాలు చేశారు. కాలనీ వాసులు ఏం జరిగిందో తెలియక ఉలిక్కిపడ్డారు. ప్రతి కుటుంబానికీ సంబంధించిన వాహన పత్రాలు, ఆధార్కార్డులను పరిశీలించారు. అనంతరం కుంటగల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రజల సంక్షేమం, రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు సాగించే అవకాశం లేకుండా నిఘా ఏర్పాటు చేసి గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పట్టణంలో గుట్కా వంటి నిషేధిత వస్తువులను విక్రయించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సుమారు 400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి పత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, ఆరు ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకొని సీజ్ చేశారు.
మాస్కులు తప్పక ధరించాలి..
ప్రభుత్వం ఆదేశించినట్లు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఏఎస్పీ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. డిస్టెన్స్ మేనేజ్మెంట్ యాక్ట్ 188 సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆన్లైన్లో టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని వ్యాక్సిన్ తీసుకోవాలని, వేడుకలు జరుపుకునే వారు తప్పని సరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. గుంపులు గుంపులుగా తిరుగరాదని తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్లో పట్టణ సీఐ వేణుగోపాల్ రావు, ఎస్ఐలు, 200 మంది పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్పై దాడి
మమతకు ఈసీ నోటీసులు.. రిప్లైకి 48 గంటల గడువు