రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
ఎదులాపురం, జూన్ 5: జిల్లాల్లో భూముల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలెక్టర్లకు సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, ధరణి, భూముల సమస్యలపై అర్జీల పరిష్కారం, పెండింగ్ మ్యుటేషన్లు, నర్సింగ్ కళాశాలలకు భూముల కేటాయింపు, పలు అంశాలపై శనివారం హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మా ట్లాడుతూ భుముల సమస్యలపై వచ్చిన అర్జీలను పరిష్కరించాలన్నారు. కలెక్టర్లు రోజూ మానిటరింగ్ చేయాలన్నారు. ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు 100 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి కేటాయించాలన్నారు. కొత్తగా మం జూరైన మెడికల్ కాలేజీలకు 20 ఎకరాలు, నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు 5 ఎకరాలు గుర్తించాలని ఆదేశించారు. ట్రిబ్యునల్ కోర్టులో ఉన్న కేసులు, భూములకు సంబంధించిన అర్జీలను ఈ నెల 20లోగా చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. వీడియోకాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు ఎన్ నటరాజ్, ఎం డేవిడ్, ఆర్డీవో జాడే రాజేశ్వర్, రోడ్లు భవనాల శాఖ ఈఈ నర్సయ్య, డిప్యూటీ ఈఈ సురేశ్, కలెక్టరేట్ పరిపాలనాధికారి అరవింద్ కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు వర్ణ, సుశీల, స్వాతి పాల్గొన్నారు.
కలెక్టరేట్ల భవనాల పనుల్లో వేగం పెంచాలి..
నిర్మల్ టౌన్, జూన్ 5: కలెక్టరేట్ల భవనాల పనులు వేగం పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. హైదరాబాద్ నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ కంప్లెక్స్, నిర్మాణాల పూర్తి, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్, నూతన మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు భూములు బదలాయింపు, ధరణికి సంబంధించిన విషయాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. 12 జిల్లా ల్లో కలెక్టరేట్ కాంప్లెక్స్ను వారంలోగా పూర్తి చేసిప్రారంభించడానికి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్లను ఆదేశించారు. నిర్మల్ జిల్లాలో కలెక్టరేట్ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేస్తామని, ధరణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తామని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ కోర్టు కోసం అనువైన భూమిని పరిశీలించి టీఎస్ఐఐసీకి పంపామని, స్పెషల్ ట్రిబ్యునల్ ద్వారా కేసుల విచారణ పూర్తి చేస్తామని తెలిపారు. రైతులకు నూతన పట్టాదారు పాస్పుస్తకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ నెల 9 వరకు నిర్దేశించిన పనులు పూర్తి చేస్తామని వివరించారు. వీడియోకాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, పీ రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.