పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి
మానవహక్కుల కమిషన్ చైర్మన్ చంద్రయ్య
విద్యార్థుల ఆన్లైన్ క్లాసులపై ఆరా
సీసీసీ అతిథిగృహంలో జిల్లా అధికారులతో హెచ్ఆర్సీ సమీక్ష
సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 5 : కరోనా వైరస్ రెండో దశ ఉధృతం కావడంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ చంద్రయ్య అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనకు సోమవారం వచ్చిన ఆయనకు సీసీసీ సింగరేణి అతిథిగృహంలో అధికారులు ఘనస్వాగతం పలికారు. పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పోలీస్, రెవెన్యూ, విద్య, వైద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిపార్ట్మెంట్ల వారీగా పలు అంశాలపై ఆరా తీశారు. పోలీస్, రెవెన్యూ, విద్య, వైద్యం ప్రజలకు అందుతున్న తీరుపై అధికారులు వివరించారు. ఈ సందర్భంగా పలు సలహాలు, సూచనలు చేశారు.
అందరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలి..
కరోనా వైరస్పై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ప్రజలకు అందుతున్న వైద్యం, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్న తీరు, సిబ్బంది కొరత, దవాఖానల స్థితిగతులు, తదితర అంశాలపై జిల్లా వైద్యాధికారి నీరజను అడిగి తెలుసుకున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తామంతా అప్రమత్తంగా ఉన్నామని పేర్కొన్నారు. సింగరేణి, పీహెచ్సీ, ప్రభుత్వ ఏరియా దవాఖానల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో దాదాపు 18వేల మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆమె హెచ్ఆర్సీకి వివరించారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించిన డయాలసిస్ సెంటర్ను మంచిర్యాలలో ఏర్పాటు చేశామని, అందుకు తగిన ఏర్పాట్లు చేసి డయాలసిస్ చేస్తున్నట్లు చెప్పారు.
పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి..
జిల్లాలో నమోదవుతున్న కేసులు, పెండింగ్లో ఉన్నవి, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, పౌరులకు అందుతున్న పోలీస్ సేవలను రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. ముఖ్యంగా చిట్ఫండ్స్, లాటరీదందా, చీటింగ్, ల్యాండ్మాఫియా, సైబర్నేరాల ప్రభావం ఎక్కువగా ఉందని సీపీ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 109 ఎస్సీ, ఎస్టీ కేసులు పెండింగ్లో ఉన్నాయని, ప్రస్తుతం ఇవి విచారణ దశలో ఉన్నట్లు వివరించారు. హెచ్ఆర్సీ నుంచి వచ్చిన మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. మహిళలపై దాడులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కరోనా సమయంలో పోలీసులు కీలకపాత్ర పోషించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హెచ్ఆర్సీ నుంచి వచ్చిన కేసులు పెండింగ్ లేకుండా చూడాలని ఆయన సీపీకి సూచించారు.
పేద పిల్లలకు మెరుగైన విద్యఅందించాలి..
పేదల పిల్లలకు మెరుగైన విద్యనందించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు, సమస్యలు, మౌలిక సదుపాయాలు, ఆన్లైన్ విద్యావిధానంపై జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లును అడిగితెలుసుకున్నారు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు దాదాపు 80శాతం బోధన పూర్తి చేసినట్లు చెప్పారు. సమావేశంలో మంచిర్యాల జిల్లా రెండో అదనపు జడ్జి వెంకటేశ్వర్లు, కుమ్రంభీం జిల్లా మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి నారాయణ, జిల్లా న్యాయమూర్తులు శ్రీలేఖ, తిరుపతి, రమేశ్, మహతివైష్ణవి, సుమలత గ్రేవాల్, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్, డీఎంహెచ్వో డాక్టర్ నీరజ, డీఈవో వెంకటేశ్వర్లు, ఆర్డీవో శ్యామలాదేవి, నస్పూర్ తహసీల్దార్ రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
పిల్లలను ఉన్న చదువులు చదివించాలి
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జీ చంద్రయ్య అన్నారు. మండలంలోని తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పాఠశాలను సోమవారం సందర్శించారు. అనంతరం ప్రముఖ హోమియోపతి వైద్యుడు ఎంఎన్ రాజు ఏర్పాటు చేసిన క్యాంప్ను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్య నేర్పించాలని తెలిపారు. తల్లిదండ్రులు చదివించడంతోనే తాను ఈస్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. అనంతరం అయన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామంలోని మహిళలకు చీరలు, జాకెట్లు పంపిణీ చేశారు. అంతకుముందు తాళ్లపేట ప్రాథమిక అరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సిబ్బందికి పలు సూచనలు అందించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయమ్మ, జగ్జీవన్, లక్ష్మణాచారి, శ్రీలేఖ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భూమారెడ్డి, డీఈవో వెంకటేశ్వర్లు, ఆర్డీవో శ్యామల, సర్పంచ్ జాడి గంగాధర్, ఎంపీటీసీ వెంకటస్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు.