ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి lపల్సిలో వైభవంగా బీరప్ప విగ్రహ ప్రతిష్ఠ
కనుల పండువగా బీరప్ప కల్యాణ మహోత్సవం
కుభీర్, ఏప్రిల్ 5 : బీరప్ప మార్గం అనుసరణీయమని, బీరన్నలు కురుమల సంస్కృతిని పరిరక్షిస్తూ, భవిష్యత్ తరాలకు అందిస్తుండడం అభినందనీయమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి కొనియాడారు. సోమవారం మండలంలోని పల్సి గ్రామంలో నిర్మించిన నూతన ఆలయంలో బీరప్ప విగ్రహ ప్రతిష్ఠాపన, కలశం, ధ్వజారోహణ, శిఖర స్థాపన, బీరప్ప కల్యాణ మహోత్సవాలు కనుల పండువగా జరిగాయి. ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ, గొల్ల కుర్మల ఆర్థికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శద్ధ కనబరుస్తున్నదని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే విఠల్రెడ్డిని కురుమల సంప్రదాయ దుస్తులైన గొంగడి, గొర్రెలను బహూకరించి శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బోధన్ మండలానికి చెందిన బీరన్నల వేదమంత్రాల మధ్య గావు పట్టుట కార్యక్రమాలు నిర్వహించారు. నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు పవార్ రామారావు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి, వైస్ ఎంపీపీ మొమియొద్దీన్, మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ రేకుల గంగాచరణ్, టీఆర్ఎస్ నాయకులు తూం రాజేశ్వర్ ఆలయ ప్రాంగణంలో భారీ అన్నదానం నిర్వహించారు. పల్సి సర్పంచ్ శ్రీరాముల రాజేశ్, ఎంపీటీసీ కొట్టె రాజమణి, ఉప సర్పంచ్ టేకుల్వార్ దత్తు, కురుమ సంఘం అధ్యక్షుడు చిపాడి సాయినాథ్, శ్రీరాముల రాజేశ్, మాజీ సర్పంచ్లు కొట్టె హన్మాండ్లు, దత్తురాం పటేల్, డోలేవార్ పోతన్న, గన్నోర విఠల్, మాజీ ఎంపీటీసీలు తోకల రాములు, తోట రాములు, తోట రాజలింగు, డాక్టర్ కుబ్రె రాజన్న, పబ్బు ధర్మపురి, చుట్టు పక్కల గ్రామాలు, మండలాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.