మంచిర్యాల చౌరస్తా-గాజుల్పేట్ వరకు నిర్వహణ 10
తొలగనున్న దీర్ఘకాలిక సమస్యలు..
దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పాలకులు, అధికారులు
హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 5:నిర్మల్.. అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పట్టణం మరింత సుందరంగా మారబోతున్నది. జిల్లాను ఆదర్శంగా నిలుపాలనే పట్టుదలతో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిధులు తీసుకురాగా.., సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అంతర్గత రోడ్ల విస్తరణ, కోటలు, రహదారి అభివృద్ధి పనులు, సెంట్రల్ లైటింగ్, స్ట్రిప్ లైటింగ్, పట్టణానికి ముఖ ద్వారాల్లో ఆర్చ్లు, రహదారి మధ్యలో డివైడర్లు.., వాటి మధ్యలో పూలమొక్కలు, చెట్లు, ఫౌంటేయిన్ల ఏర్పాటుతో కొత్త శోభ సంతరించుకున్నది. అలాగే ప్రస్తుతం రూ.5.20 కోట్లతో చేపడుతున్న రహదారి సందరీకరణ పనులతో మరింత వన్నె తెచ్చుకోనున్నది. కాగా, ట్రాఫిక్ సమస్య, రోడ్డు ప్రమాదాలు దూరం కానుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వ రూ.5.20 కోట్లతో మంచిర్యాల చౌరస్తా(శివాజీ చౌక్) నుంచి ట్యాంక్ బండ్ వరకు 3 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రహదారి సుందరీకరణతో పాటు బస్టాఫ్, ఆటోస్టాండ్, పార్కింగ్ జోన్స్, వీధి వ్యాపారులకు క్రమబద్ధంగా విక్రయాలు జరుపుకునేందుకు స్టాళ్ల ఏర్పాటు, పూల మొక్కల పెంపకం, ఫుట్పాత్ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పట్టణంలోని పలు చోట్ల ఇష్టం వచ్చిన చోట బస్సులను ఆపడం, సరైన ఆటోస్టాండ్ లేకపోవడం, ఎక్కడపడితే అక్కడ వాహనాల పార్కింగ్తో ట్రాఫిక్ సమస్యలు తలెత్తేవి. వీటితో పాటు అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి ఎందరో మృత్యువాత పడ్డ సంఘటనలూ ఉన్నాయి. ఇక బస్టాండ్ ప్రాంతంలో ఎక్కడపడితే అక్కడ తోపుడు బండ్లను ఏర్పాటు చేసి, రోడ్లపైనే వ్యాపారం నిర్వహిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా జనాలతో నిత్యం రద్దీ నెలకొంటున్నది. అయితే నూతనంగా చేపట్టే అభివృద్ధి పనులతో సమస్యలన్నీ దూరం కానున్నాయి. 35 మీటర్ల వెడల్పు రోడ్డులో.. మీటర్ వెడల్పుతో డివైడర్, అందులో పూల మొక్కలు, చెట్ల పెంపకం.., 3.5 మీటర్ల చొప్పున 2 లేన్ల రహదారులు, మరో 3.5 మీటర్ల బస్లేన్, 2.3 మీటర్ల పార్కింగ్ లేన్, 1.8 మీటర్ సైడ్ వాకింగ్ (ఫుట్పాత్), 0.6 మీటర్లలో పూల కుండీలు, 0.3 మీటర్లలో విద్యుత్ స్తంభాల కోసం, 2.7 మీటర్లు చిరువ్యాపారుల కోసం, 2.7 వెయిటింగ్ ఏరియా ఏర్పాటుతో పనులను చేస్తున్నారు.
ప్రారంభమైన పనులు..
రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇప్పటికే అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. హైదరాబాద్కు చెందిన పలువురు ఇంజినీర్లు ఇప్పటికే మార్కింగ్ పనులు నిర్వహించగా, సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయం వద్ద అభివృద్ధి పనులను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ప్రారంభించారు. పనుల నేపథ్యం లో ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ముందస్తుగానే వ్యాపారులు, వాణిజ్య దుకాణాదారులతో చర్చించారు. దీంతో కేవలం 3 నుంచి 4 నెలల్లోనే పనులు పూర్తికానున్నాయి.
జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకే..
నూతనంగా ఏర్పడిన నిర్మల్ను అన్ని జిల్లాల కంటే వేగంగా అభివృద్ధి చేసి, ఆదర్శంగా నిలిపేందుకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కృషిచేస్తున్నారు. కోట్లాది రూపాయలతో పనులు చేపడుతున్నారు. ఇప్పటికే రహదారి విస్తరణ పనులు, సెంట్రల్ లైటింగ్, స్ట్రిప్ లైటింగ్, డివైడర్లో మొక్కల పెంపకం, ఆర్చ్లు, ఫౌంటేయిన్ల నిర్మాణంతో పట్టణం అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నది. ప్రస్తుతం రూ.5.20 కోట్లతో చేపట్టనున్న సుందరీకరణ పనులతో పట్టణానికి మరింత శోభరానున్నది.
మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్
ఇవి కూడా చదవండి
బ్లాక్ కాఫీ.. గుండెకు మంచిదేనా?
అడ్వాన్స్డ్ చాఫ్ టెక్నాలజీ అభివృద్ధి పరిచిన డీఆర్డీవో
లాక్డౌన్ అంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తి అరెస్ట్