కన్నెపల్లి, జూలై 30 : బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. భీమిని మండలంలోని వడాల గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆమె శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. పనులు త్వరగా పూర్తి చేసి మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. వనం చుట్టూ బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఎంపీడీవో జవహర్లాల్, తదితరులు ఉన్నారు.
బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలి
హాజీపూర్, జూలై 30 : మండలంలోని కర్నమామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని కొండపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె పకృతి వనాన్ని జిల్లాకే ఆదర్శంగా తీర్చిదిద్దాలని హాజీపూర్ మండల పరిషత్ అధ్యక్షురాలు మందపెల్లి స్వర్ణలత పేర్కొన్నారు. శుక్రవారం బృహత్ పల్లె పకృతి వనం పనులను ఎంపీడీవో అబ్దుల్ హై, కర్నమామిడి సర్పంచ్ కొట్టె మహేందర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పట్టణాల్లోని పార్క్లతో సమానంగా బృహత్ పల్లె ప్రకృతి వనంలో సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో మల్లయ్య, ఎంపీవో కందుకూరి రవిబాబు, పంచాయతీ ఏఈ కామేశ్వర రెడ్డి, ఈసీ శ్రీనివాస్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి చంద్రకళ, ఆత్మ చైర్మన్ మల్లారెడ్డి తదితరులున్నారు.
బృహత్ ప్రకృతి వనం పరిశీలన
కోటపల్లి, జూన్ 30 : కోటపల్లి మండలకేంద్రంలో ఏర్పాటు చేయనున్న బృహత్ ప్రకృతి వనాన్ని ఎంపీడీవో కొలిపాక భాస్కర్, ఎంపీవో ముల్కల్ల సత్యనారాయణ పరిశీలించారు. ప్రకృతి వనంలో మొక్కలు నాటేందుకు కూలీలు గుంతలు తవ్వుతుండగా, పనులను పరిశీలించి ఎంపీడీవో పలు సూచనలు చేశారు. బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సుందరంగా తీర్చి దిద్దాలని, 31 వేల మొక్కలకు తగ్గకుండా నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి రవళి, టీఏ చిరంజీవి పాల్గొన్నారు.