ఆరు డిపోల పరిధిలో కార్యక్రమం
616 మంది సూపర్ స్ప్రెడర్లకు టీకా
ఇప్పటికే వేసుకున్న 45 ఏండ్లు పైబడిన సిబ్బంది
పర్యవేక్షించిన ఆర్టీసీ, వైద్యాధికారులు
ఆదిలాబాద్టౌన్/ఉట్నూర్/నిర్మల్ అర్బన్/భైంసా, మే 30:కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పలువురిని సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి విడుతలవారీగా టీకాలు వేస్తున్నది. ఇందులో భాగంగా ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆరు డిపోల పరిధిలో ఆర్టీసీ ఉద్యోగులకు నిర్వహించిన వ్యాక్సినేషన్ విజయవంతమైంది. మొత్తం 616 మందికి టీకా వేయగా, ఇంతకు ముందే 45 ఏళ్లుపైబడిన అనేక మంది వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. కాగా, ఆయా కేంద్రాలను ఆర్టీసీ, వైద్యాధికారులు పరిశీలించారు.
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి కేటగిరీల వారీగా టీకాలు వేస్తున్నది. మొదట జర్నలిస్టులు, కూరగాయల వ్యాపారులు, వంట గ్యాస్ సరఫరాచేసే వారు, పెట్రోల్ పంపుల్లో పని చేసేవారు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లో పనిచేసేవారు, పండ్లు, పూలు అమ్మే వ్యాపారులు, కిరాణా దుకాణం దారులు, వైన్స్లు నిర్వహించే వారు, రేషన్ షాపులు నిర్వహించే వారికి ప్రాధాన్యత ఇచ్చి శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు టీకాలు వేశారు. ఇక ప్రజా రవాణాలోని సూపర్ స్ప్రెడర్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా ఆర్టీసీలో పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లకు ఆదివారం టీకాల కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలోని డ్రైవర్లు, కండక్టర్లకు వైద్య సిబ్బంది టీకాలు వేశారు. ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో 156 మంది డ్రైవర్లు, 133 మంది కండక్టర్లు ఉన్నారు. వీరిలో 45 ఏళ్ల వయస్సు కలిగిన కండక్టర్లు 49 మంది ఉండగా, వీరిలో 38 మంది వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. డ్రైవర్లు 29 మంది ఉండగా, వీరిలో 26 మంది వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. 45 ఏళ్లపైబడిన వారు ఇప్పటికే వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. ప్రజా రవాణాలో నిత్యం సేవలు అందించే ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది.
మంచిర్యాలలో 115 మందికి..
గర్మిళ్ల, మే 30 : మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్లో జిల్లా వైద్యశాఖ అధికారి సుబ్బారాయుడు ఆదివారం ప్రారంభించారు. మంచిర్యాల డిపోలో పని చేస్తున్న 115 మంది డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి వైద్య సిబ్బంది కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం అయినందుకు డీఎం సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా ఉప వైద్యశాఖాధికారి ఫయాజ్ ఖాన్, మంచిర్యాల జిల్లా రవాణాశాఖ అధికారి కిష్టయ్య, మంచిర్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేశయ్య, హెడ్ కానిస్టేబుల్ సురేందర్ రావు, ఏఎంటీ శ్రీలత, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్లో 136 మందికి
ఆదిలాబాద్ టౌన్, మే 30 : ఆదిలాబాద్ ఆర్టీ సీ డిపో పరిధిలో ఆదివారం ప్రత్యేక వ్యాక్సినేషన్ సెంటర్ను డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ ప్రారంభించారు. డిపోలో మొత్తం 162 మంది సిబ్బంది ఉండగా, 136 మంది టీకా తీసుకున్నారు. డీవీ ఎం రమేశ్, డీఎం జనార్దన్, అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
ఉట్నూర్లో 34 మంది..
ఉట్నూర్, మే 30 : ఊట్నూర్ ఆర్టీసీ డిపో పరిధిలో ఆదివారం వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఈ డిపో పరిధిలో మొత్తం 55 మంది ఉండగా, ఆదివారం 34 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక ఇంతకుముందే 21 మంది టీకా వేయించుకున్నారు. ఇక్కడ 100 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
నిర్మల్లో 130 మందికి..
నిర్మల్ అర్బన్, మే 30 : నిర్మల్ డిపోలో 555 మంది సిబ్బంది ఉండగా, ఆదివారం 130 మందికి టీకా వేశారు. అంతకుముందే 400 మంది మొదటి, సెకండ్ డోస్ టీకా తీసుకున్నారు. ఇక్కడ 98 శాతం పూర్తయ్యింది.
భైంసాలో 137 మందికి..
భైంసా, మే, 30 : పట్టణంలోని భైంసా ఆర్టీసీ డిపోలో ఆదివారం ఆర్టీసీ కార్మికులకు వ్యాక్సిన్ వేశారు. 137 మంది కార్మికులకు వ్యాక్సిన్ ఇచ్చారని ఆర్టీసీ డీఎం రవీందర్ తెలిపారు. ఈ వ్యాక్సినేషన్లో హెచ్ఈవో ఖలీం, డాక్టర్ మతీన్ ఉన్నారు.
టీకాతో మరింత ధైర్యం
సర్కారు ఆర్టీసీ ఉద్యోగుల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ సెంటర్ను ప్రారంభించడం బాగుంది. నేను ఆదివారం టీకా తీసుకున్నా. దీంతో మరింత ధైర్యం వచ్చింది. రోజూ వందలాది మంది ప్రయా ణికులకోసం రిజర్వేషన్ కౌంటర్లో ఉండే మాకు టీకా ఆవశ్యకమని ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.