క్వింటాల్కు రూ.8100 మద్దతుకంటే రూ.2075 అదనం
ఉమ్మడి జిల్లాలో 10.18 లక్షల ఎకరాల్లో సాగు
62 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా
ఆదిలాబాద్, అక్టోబర్ 28 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) :అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్లకు డిమాండ్ ఉండగా, ఈ యేడాది ధర రికార్డు స్థాయికి చేరుకున్నది. క్వింటాల్కు మద్దతు ధర రూ.6025 ఉండగా, ప్రైవేట్ వ్యాపారుల మధ్య పోటీతో రూ.8100 పలుకుతున్నది. మద్దతు ధరకంటే రూ. 2075 అదనంగా అందుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10.18 లక్షల ఎకరాల్లో కాటన్ సాగుచేస్తుండగా, 62 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. ప్రస్తుతం దూది ధర బంగారాన్ని తలపిస్తుండడంతో అన్నదాతల్లో ఆనందం కనిపిస్తున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు వానకాలం సీజన్లో పత్తి పంటను సాగు చేస్తారు. రైతులు పత్తి పంట సాగుకు బీటీ విత్తనాలను ఉపయోగిస్తారు. ఈ విత్తనాలు తయారు చేసే కంపెనీల మధ్య పోటీ పెరగడంతో పత్తి కాయలు ఎక్కువ కాసే విత్తనాలు తీసుకుంటారు. ఏ విత్తనం కొనాలనే విషయంలో వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పరిగణనలోకి తీసుకుంటారు. కాయబరువు ఎక్కువ ఉన్నవి. గత పంటసాగు అనుభావాలను దృష్టిలో ఉంచుకొని పంటలు వేస్తారు. ఎక్కువ దిగుబడులు సాధించడానికి మొక్కల సాంద్రతను పెంచుకొనే రకాలను వినియోగిస్తున్నారు. జూన్ మొదటి, రెండో వారంలో పంటను వేయగా అక్టోబర్ మొదటి వారంలో దిగుబడులు ప్రారంభమవుతాయి. జిల్లాలోని నేల స్వభావం, పంటకు అనుకూలమైన వాతావరణం, అధిక వర్షపాతం లాంటి కారణంతో జిల్లాలో రైతులు పండించే పత్తి ఆసియాలో నాణ్యమైనదిగా పేరుంది. దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. పింజ పొడవు ఎక్కువగా ఉండడంతో పాటు దారంతో పొడవు ఎక్కువగా వచ్చి నాణ్యతగా ఉంటుంది. దారం గట్టిగా వస్తుంది. దూది సైతం తెల్లగా, ఆకట్టుకునేలా ఉంటుంది. ఫలితంగా వ్యాపారులు ఆదిలాబాద్లో సాగు చేసే పత్తిని కొనడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. ఇందులో అంతర పంటగా కందిని సాగు చేస్తారు. ఆరు, ఎనిమిది సాళ్లకు ఒకటి చొప్పున కంది సాలు వేస్తారు. పత్తిలో అంతర పంటను సాగు చేయడంతో మిత్ర పురుగుల సంఖ్య పెరగడమే కాకుండా వాతావరణ ఒడిదుడుకుల నుంచి రక్షణ కలుగుతుంది. ఎకరా పత్తి పంటలో కందిని అంతర పంటగా సాగు చేస్తే మూడు క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
ఉమ్మడి జిల్లాలో 10.18 ఎకరాల్లో సాగు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10.18 లక్షల ఎకరాల్లో రైతులు వానకాలంలో పత్తి పంటను సాగు చేశారు. ఈ సీజన్లో 62 లక్షల క్వింటాళ్ల పంట విక్రయానికి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 3.90 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి వేయగా.. 27 లక్షల క్వింటాళ్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 3.23 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా.. 13 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. నిర్మల్ జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో పంట సాగవగా.. 8 లక్షల క్వింటాళ్లు, మంచిర్యాల జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో వేయగా.. 14 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రికార్డు స్థాయిలో ధర..
ఈ ఏడాది పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గతేడాది పత్తికి కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.5825 ఉండగా.. ప్రభుత్వం ఈ సారి రూ.200 పెంచి క్వింటాల్కు రూ. 6025 ప్రకటించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీసీఐ ఆధ్వర్యంలో మద్దతు ధరతో అధికారులు పంట కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్లకు ధర అధికంగా ఉండడంతో పాటు దేశ వ్యాప్తంగా పంట సాగు విస్తీర్ణం తగ్గడంతో ఈ ఏడాది పత్తికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువకు పంటను రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. గురువారం జిల్లాలో క్వింటాల్కు రూ.8100 ఇచ్చి కొన్నారు. మద్దతు ధర కంటే రూ. 2075 అధికంగా ప్రైవేట్ వ్యాపారులు చెల్లిస్తున్నారు. అధిక ధరలు లభించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ జిన్నింగ్లలో విక్రయాలు సరిగా జరిగేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేయడంతో పాటు రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు నిరంతరం పంట కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారు.
రంది లేకుండా అమ్ముతున్నాం..
ఈ సారి పత్తి అమ్మకాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. మార్కెట్యార్డులో ఆరు కాంటాలు పెట్టిన్రు. రైతులకు ఎలాంటి రంది లేకుండా చూస్తున్నరు. నేను 15 ఎకరాల్లో పత్తిని ఏసిన. ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశంఉన్నది. ఇప్పటికే 30 క్వింటాళ్ల పంటను విక్రయించా. పత్తి క్వింటాల్కు 8 శాతం తేమతో రూ.8100 ఇచ్చి ప్రైవేట్ వ్యాపారులు కొంటున్నారు. ఇంత మంచి ధర ఇప్పటి దాకా చూడలే.