హాజీపూర్, అక్టోబర్ 28 : జిల్లాలో 18 ఏళ్లు వయస్సు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని సంబంధిత అధికారులను మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్తో కలిసి ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేక అధికారులతో వ్యాక్సినేషన్పై సమీక్షా సమావేశంనిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కరోనా వైరస్ థార్డ్ వేవ్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నదని, ఈ నేపథ్యంలో రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు. జిల్లాలో నవంబర్ 3వ తేదీ వరకు మొదటి డోస్ కార్యక్రమం ముగుస్తున్నదని, రెండో డోస్ పూర్తి స్థాయిలో అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులకు కేటాయించిన ప్రాంతాల్లో చౌకధరల దుకాణాల డీలర్లు, ఆసరా పింఛన్ల జాబితా ప్రకారం ఆశ కార్యకర్తలతో కలిసి ఇంటింటా సర్వే చేయాలన్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించి టీకా వేయించాలన్నారు. గ్రామాలవారీగా సర్వే చేసి, మొదటి, రెండు డోసులు తీసుకోవాల్సిన వారిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మైనార్టీలకు సంబంధించి ఆయా మత పెద్దల ద్వారా అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. విధులు బాధ్యతగా నిర్వహించాలని సూచించారు. కరోనా బారిన పడి వారు చికిత్స నిమిత్తం జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాలు, రాష్ర్టాల నుంచి వస్తున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. గిరిజన గ్రామాలు, మైనార్టీ జనాభా ఉన్న ప్రాంతాల్లో వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.