కరోనా పేరిట ప్రైవేట్ దవాఖానల అత్యుత్సాహం
అడ్డగోలు ఫీజుల వసూలు,నిబంధనలు
బేఖాతర్పై వైద్యాధికారుల ఆగ్రహం
ఆదిలాబాద్లో నాలుగు హాస్పిటళ్లకు నోటీసులు
ఆదిలాబాద్, మే 28 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని రిమ్స్లో అన్ని ఏర్పాట్లు చేసింది. 510 బెడ్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఐసీయూ వార్డులో సేవలు, ఆక్సిజన్ బెడ్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో వైరస్ సోకిన వారికి రిమ్స్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా, నెల రోజుల కిందట పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రైవేట్ దవాఖానలకూ కొవిడ్ చికిత్స అందించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో 45, నిర్మల్లో 50 దవాఖానాలను ఇందుకు గుర్తించారు. ప్రస్తుతం ఆదిలాబాద్లో 8, నిర్మల్లో 16 దవాఖానల్లో కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వీటిలో ఆయా జిల్లాలకు చెందిన వారితో పాటు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా చికిత్స పొందుతున్నారు. కొవిడ్ పేషెంట్లకు చికిత్సకు సంబంధించి ఫీజుల విషయంలో ప్రభుత్వం ప్రైవేటు దవాఖానల నిర్వాహకులకు పలు సూచనలు చేసింది. బాధితులకు అందిస్తున్న వైద్యం మేరకు డబ్బులు తీసుకోవాలని, ఇందుకు తగిన బిల్లులు ఇవ్వాలని సూచించింది.
నిబంధనలు ఉల్లంఘన
ప్రస్తుత పరిస్థితుల్లో సేవాధృక్పథంతో వైద్యసేవలు అందించాల్సిన ప్రైవేటు వైద్యశాలల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. చికిత్సకోసం వచ్చిన వారికి అవసరం లేని పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాధితుల కుటుంబసభ్యులు, బంధువులను ఆందోళనకు గురిచేస్తున్నారు. తమ వారి ప్రాణాలు ఎలాగైనా దక్కించుకోవాలని కుటుంబసభ్యులు అప్పులు చేసి వైద్యానికి డబ్బులు తీసుకువస్తున్నారు. కనీస కనికరం లేకుండా దోపిడికి దిగుతున్నారు. దీంతో పాటు దవాఖానల్లో కనీస నిబంధనలు పాటించడం లేదు. అందులో పనిచేసే సిబ్బందికి కూడా రక్షణ చర్యలు చేపట్టడం లేదు. పీపీఈ కిట్లు అందుబాటులో లేకపోవడం, అగ్నిప్రమాద నివారణ చర్యలు తీసుకోకపోడం, పాజిటివ్ వచ్చిన వారి పక్కనే బంధువులు కూర్చోవడం, పడకల మధ్య దూరం పాటించకపోవడం, అర్హత కలిగిన నర్సులు లేకపోవడం, పారిశుధ్య నిర్వహణా లోపం, ఇలా పలు లోపాలను ఇటీవల తనిఖీల్లో అధికారులు గుర్తించారు. దీంతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా బిల్లులు వసూలు చేయడం, కంప్యూటర్ బిల్లులు ఇవ్వకపోవడం లాంటివి తనిఖీల్లో బయటపడ్డాయి. దీంతో అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేసి, చర్యలకు ఉపక్రమించారు.
నాలుగు దవాఖానలకు నోటీసులు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిత్య, అమ్మ, నక్షత్ర, శ్రీ క్రిటికల్ కేర్ దవాఖానలకు నోటీసులు జారీ చేసినట్లు జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ తెలిపారు. నిబంధనల ఉల్లంఘనపై చర్యలెందుకు తీసుకోకూడదో సమాధానమివ్వాలని యాజమాన్యాలను కోరినట్లు చెప్పారు. దీంతో లోపాలను సరిచేసుకుంటామని, నిబంధనలు పాటిస్తామని సంబంధిత నిర్వాహకులు సమాధానం పంపారని డీఎంహెచ్వో తెలిపారు. ఇకపై క్రమంగా తనిఖీలు కొనసాగుతాయని, మరోసారి తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవని వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు.
తనిఖీలు కొనసాగుతాయి..
జిల్లాలో కొవిడ్ బాధితులకు సేవలందిస్తున్న ప్రైవేటు దవాఖానల్లో తనిఖీలు కొనసాగుతాయి. ఇందుకోసం ఇప్పటికే వైద్యాధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేశాం. నాలుగు ప్రైవేట్ దవాఖానలకు నోటీసులు కూడా జారీ చేశాం. సంబంధిత యాజమాన్యాల నుంచి సమాధానాలు అందాయి. ఇకపై నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలుంటాయి. ప్రభుత్వ ఆదేశాలను ప్రతి దవాఖాన నిర్వాహకులు పాటించాల్సిందే. దవాఖానలపై రాతపూర్వక ఫిర్యాదులు అందితే తప్పకుండా స్పందిస్తాం.