నిర్మల్ జిల్లాలో రెడ్ అలర్ట్
జోరుగా వానలు
ఉప్పొంగుతున్న వాగులు, వంకలు
ప్రాజెక్టుల్లోకి భారీగా వరద
ఆదిలాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ గుబులు పుట్టిస్తున్నది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో హై అలర్ట్, నిర్మల్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. అప్రమత్తంగా ఉండి.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలంటూ ఆదేశాలు జారీ చేయగా, ఆయాచోట్ల యంత్రాంగం ముందస్తు చర్యలు చేపడుతున్నది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరుతుండడం, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది. ఆయా జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, రెండు, మూడు గంటలకోసారి కలెక్టరేట్లకు సమాచారమందించాలని సూచించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ప్రభావం చూపే అవకాశముండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిర్మల్ జిల్లాలో రెడ్ అలర్ట్గా ప్రకటించారు. తుఫాను కారణంగా సోమవారం నుంచి ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడక్కడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు గేటు, ఆదిలాబాద్ జిల్లా సాత్నాల ప్రాజెక్టు రెండు గేట్లు, మత్తడి ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి అధికారులు నీటిని బయటకు వదులుతున్నారు. ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాల్లోని ప్రజలు పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పోలీసు, రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, వ్యవసాయశాఖ, రోడ్లు భవానాలు, పంచాయతీ, విద్యుత్, ఫైర్ శాఖల అధికారులు భారీ వర్షాల కారణంగా నష్ట నివారణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
కంట్రోల్ రూమ్లు
భారీవర్షాల నేపథ్యంలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్రూమ్లను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్లో కంట్రో ల్ రూమ్ నంబర్ 18004251939, నిర్మల్ జిల్లా లో కంట్రోల్ రూమ్ నంబర్ 18004255566, మంచిర్యాలలో కంట్రోల్ రూమ్ నంబర్ 08736-250501, ఆసిఫాబాద్లో 08733-27933, 18005991200లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా అధికారు లు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వా గులు, నదులు ఉప్పొంగే అవకాశం ఉన్నందున గ్రా మీణ ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. పట్టణాల్లో సైతం లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు తమ శాఖలకు సంబంధించిన వివరాలను రెండు, మూడు గంటలకోసారి కలెక్టరేట్కు పంపించాలని కోరారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
పలుచోట్ల భారీ వర్షం
కోటపల్లి/వేమనపల్లి, సెప్టెంబర్ 27 : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో సోమవారం భారీ వర్షం కురుస్తోంది. ఎడ తెరిపిలేకుండా పడడంతో వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి, ప్రాణహిత నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. ఆయా ప్రాంతాల ప్రజలను కోటపల్లి ఎస్ఐ రవికుమార్ అప్రమత్తం చేశారు. నక్కలపల్లి గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న వాగు, నక్కలపల్లి-బ్రాహ్మణపల్లి గ్రామాల మధ్యనున్న వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎదుల్లబంధం సమీపంలోని తుంతుంగా చెరువు మత్తడి దుంకుతున్నది. వేమనపల్లి మండలం సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడ తెరిపి లేని వర్షం కురిసింది. నీల్వాయి వాగుపై నిర్మించిన హైలెవెల్ వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రోడ్లు లేకపోవడంతో బురదమయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బద్దెవెల్లి వాగు, ముల్కలపేట, రాచర్ల, వెంచపల్లి, చామనపల్లి, బమ్మె న, బద్దెంపల్లి వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేమనపల్లి పుష్కరఘాట్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత నదిని సోమవారం వేమనపల్లి మండల తహసీల్దార్ మధుసూదన్ పరిశీలించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం ఖర్జి- రాంపూర్ గ్రామాల మధ్య చెట్లు విరిగి కరెంటు స్తంభాలపై పడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కుమ్రం భీం, వట్టివా గు ప్రాజెక్టుల లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాగుల సమీపంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. అతిభారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ భారతీ హోళికేరి,వైద్యవిధాన పరిషత్ కమిషనర్ వైదేహి
హాజీపూర్/మంచిర్యాల ఏసీసీ, సెప్టెంబర్ 27 : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భారతీ హోళికేరి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజల సహాయార్థం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల సూపరింటెండెంట్లు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ వైదేహి తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో జనరేటర్లు ఉన్నచోట ఇంధనం అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర కేసులు వస్తే తిరస్కరరించరాదని సూచించారు.