సహజ అందాలకు నిలయం
కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఎదులాపురం,సెప్టెంబర్27: సహజ అందాలు కలిగిన ఆదిలాబాద్ మరో కశ్మీర్ అని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అభివర్ణించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో పలు చోట్ల పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటి ఉనికిని బయటకు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కుంటాల , పొచ్చెర జలపాతాలు, జైనథ్ లక్ష్మీనారాయణ దేవాలయం తదితర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు. పర్యాటక రంగంపై విద్యార్థులకు ఉన్న పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. గిరిజన ఈకో టూరిజం ద్వారా రూ.9 కోట్ల తో పనులకు ప్రతిపాదనలు పంపించామని, హరిత హాటల్ నిర్మాణానికి భూమి కేటాయించినట్లు జిల్లా టూరిజం అధికారి రవికుమార్ తెలిపారు.కుంటాల జలపాతం వద్ద 60 మంది విద్యార్థులకు పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో డీఆర్డీవో కిషన్, డీఈవో ప్రణీత, వివిధ పాఠశాలల ఉపాధ్యాయలు ,విద్యార్థులు పాల్గొన్నారు.
ఆదివాసీ కళాకారులను ప్రోత్సహించాలి
అంతరించి పోతున్న ఆదివాసీ కళాకారులను ప్రోత్సహించాలని, వారు తయారు చేసిన వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్లో స్థానం కల్పించేలా డాక్యుమెంటరీ రూపొందించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. స్థానిక కళాశ్రమంలో ఆదివాసీ ఓజా కళాకారులు తయారుచేస్తున్న వస్తువులపై ఐదు రోజుల వర్క్షాపును కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆదివాసీ కళాకారుల చేతివృత్తి వస్తువులను మార్కెట్లోకి తీసుకువచ్చే లా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని సుమారు 10 మంది కళాకారులతో వస్తువులను తయారుచేయిస్తూ ఐఐటీ హైదరాబాద్ వారు డాక్యుమెంటరీ చేయడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ దీపక్జాన్, మాథ్యూస్, కళాశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు.