ప్రతి ఒక్కరికీ రక్త పరీక్షలు నిర్వహించాలి
జిల్లా మలేరియా నివారణ శ్రీధర్
ఇంద్రవెల్లి, మే27 : వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి మలేరియా సర్వే చేయాలని, ప్రతి ఒక్కరికీ రక్త పరీక్షలు చేయాలని డీఎంవో మిట్పల్లివార్ శ్రీధర్ అన్నారు. మండలంలోని కెస్లాపూర్ పరిధి కెస్లాగూడ(ఎం)గ్రామంలో ఇంద్రవెల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంతోపాటు మలేరియా సర్వేను గురువారం ఆయన పరిశీలించారు. ప్రతి ఇంటికీ వెళ్లి పూర్తి వివరాలు సేకరించాలన్నారు. ఎవరికైనా జ్వరంతోపాటు మలేరియా లక్షణాలు కనిపిస్తే వైద్యం అందించాలని సూచించారు. ప్రజలకు రక్త పరీక్షలు చేసి మలేరియాతోపాటు టైఫాయిడ్ లాంటి వ్యాధులను గుర్తించాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైద్యుడు శ్రీకాంత్, ఎంపీటీసీ మడావి భీంరావ్, హెల్త్ సూపర్వైజర్ జాదవ్ శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ బలరాం, ఏఎన్ఎంలు సుగుణ, సముద్ర పాల్గొన్నారు.
సిరికొండ, మే 27: ప్రతి గ్రామంలో మలేరియా సర్వే నిర్వహిస్తామని జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్ తెలిపారు. మండలంలోని రాంపూర్లో గురువారం ర్యాపిడ్ మలేరియా ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న దోమ తెరను ఉపయోగించుకోవాలని కోరారు. మూడేళల్లో మలేరియాకు గురైన వారిని గుర్తించేందుకు రక్త నమూనాలు సేకరిస్తున్నామన్నారు. ఇళ్లలో సర్వే నిర్వహిస్తున్న వైద్యసిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సూపర్ వైజర్లు వెంకటలక్ష్మి, జలేందర్ వైద్యసిబ్బంది ఆనంద్, విజయ్ పాల్గొన్నారు.